తిరుమలలో రేపు మరో ‘ముక్కోటి’ వేడుక

by Dishafeatures2 |
తిరుమలలో రేపు మరో ‘ముక్కోటి’ వేడుక
X

దిశ, తిరుపతి: తిరుమలలో తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బుధ, గురువారాల్లో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ముక్కోటి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని తుంబురు తీర్థానికి బుధవారం తెల్లవారు జామున 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, గురువారం తెల్లవారు జామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు అనుమతిస్తారు. పాపవినాశనం డ్యామ్ వద్ద అల్పాహారం, అన్నప్రసాదాలను అందించనున్నారు.తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ తుంబురు తీర్థం. పాపవినాశనం నుంచి కాలి నడకన అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయులకు తుంబురు తీర్థానికి అధికారులు అనుమతి ఇవ్వట్లేదు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే వారి కోసం ముందు జాగ్రత్త చర్యగా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

వారి కోసం ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. మార్గమధ్యలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలీసు, అటవీ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుంచి తుంబురు తీర్థం వరకు దారి పొడవునా భద్రతా సిబ్బందిని మోహరించారు. భక్తుల కోసం ప్రత్యేకంగా రవాణా సౌకర్యాన్ని కల్పించారు. తిరుమల, గోగర్భం డ్యాం సర్కిల్ నుంచి భక్తులు రాకపోకలు సాగించడానికి ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

Next Story

Most Viewed