Chandrababu: బోగస్ ఓట్ల నమోదుపై సీరియస్... సీఈసీకి లేఖ

by Disha Web Desk 16 |
Chandrababu: బోగస్ ఓట్ల నమోదుపై  సీరియస్... సీఈసీకి లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు, అక్రమాలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వైసీపీ నేతలతో పలు చోట్ల ఎన్నికల అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల నమోదు చేశారని లేఖలో ఆరోపించారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన బోగస్ ఓట్ల వివరాలను లేఖకు చంద్రబాబు జతచేశారు. బోగస్, నకిలీ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతోంది అని వ్యాఖ్యానించారు.

‘గతంలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో కూడా బోగస్ ఓట్ల తంతు నడిచింది. పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నేడు అదే పునరావృతం అవుతుంది. డిగ్రీ చదవని వ్యక్తులు, నకిలీ సర్టిఫికేట్‌లతో ఓటర్లుగా నమోదు చేయబడ్డారు. తప్పుడు చిరునామాలతో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా పెద్ద సంఖ్యలో ఓటర్లను చేర్చారు. తిరుపతిలో ఒకే ఇంటి చిరునామాతో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు చేర్పించారు. ఎన్నికల అధికారులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌‌తో ఓటర్లుగా చేరారు.’ అని టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలో ఫిర్యాదు చేశారు.

అధికారుల తీరుపైనా చంద్రబాబు ఫిర్యాదు

ఈ సందర్భంగా పలువురు అధికారుల తీరుపైనా చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ‘నకిలీ పత్రాలను పరిశీలన జరపకుండానే, ఉద్దేశ్య పూర్వకంగానే ఆమోదం తెలిపారని ఆరోపించారు. తిరుపతిలో 44వ డివిజన్‌లో చికెన్ దుకాణం అడ్రస్‌తో కూడా 16 బోగస్ ఓట్లు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలా చాలా ప్రాంతాల్లో బోగస్ ఓట్ల తంతు నడుస్తోందని చంద్రబాబు ఆరోపించారు. బోగస్‌ ఓట్లపై విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి సంబంధిత జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో వివరించారు. ఈ బోగస్, నకిలీ ఓట్లతో ప్రజాస్వామ్య విలువలకు, ప్రాథమిక హక్కులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బోగస్ ఓట్ల నమోదులో పాల్గొన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలో కోరారు.

Next Story

Most Viewed