చంద్రబాబు మిమ్ముల్ని మోసం చేయడానికే రూ.లక్షా 40 వేల కోట్ల హామీలిచ్చాడు : వైఎస్ జగన్ ఫైర్

by Disha Web Desk 9 |
చంద్రబాబు మిమ్ముల్ని మోసం చేయడానికే రూ.లక్షా 40 వేల కోట్ల హామీలిచ్చాడు : వైఎస్ జగన్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, సీఎం జగన్ సోమవారం దర్శి గ్రామానికి చెందిన పింఛనుదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కొన్ని విషయాలు ఆలోచించాలని అవ్వాతాతలను కోరుతున్నానని అన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్‌ ఎంతమందికి వచ్చేది అనే విషయం గుర్తుందా? అని జగన్ మరోసారి గుర్తుచేశారు. ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో వచ్చిన మార్పు గమనించండని, అవ్వాతాతలు పెన్షన్‌ కోసం అవస్థలు పడకూడదనేది నా కోరిక అని చెప్పుకొచ్చారు. అవ్వాతాతల ఆత్మ గౌరవం కోసం ఆలోచన చేశానని, దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్‌ వ్యవస్థ తీసుకోచ్చానని అన్నారు. వాలంటీర్లతో నేరుగా అవ్వాతాతల ఇంటికే పెన్షన్‌ పంపించామని, గత 56 నెలలుగా మన ప్రభుత్వం 1వ తేదీ ఉదయమే పెన్షన్‌ అందించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అరకొరగా పెన్షన్‌ ఇస్తుంటే దానిని మార్పు చేశామన్నారు.

అర్హత ఉంటే చాలు ప్రతీ ఒక్కరికీ పెన్షన్‌ అందుతుందని తెలియజేశారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా పెన్షన్‌ అందించామని, ఇవాళ 66 లక్షల మందికి పైగాపెన్షన్‌ అందిస్తున్నామని తెలిపారు. ఇవాళ రూ.3 వేల వరకూ పెన్షన్‌ పెంచుకుంటూ వచ్చామన్నారు. అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే మనసులో ప్రేమ ఉండాలన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేశానని చంద్రబాబు చెబుతుంటారు. ఏ రోజైనా చం‍ద్రబాబు మీ గురించి ఆలోచన చేశాడా? అని చంద్రబాబుపై మండిపడ్డారు. రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయని.. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చేశాయని, వీటిని మార్చేందుకు మీ బిడ్డ జగన్ అడుగులు ముందుకు వేస్తున్నాడని వెల్లడించారు.

ఎన్నికల ముందు మేనిఫెస్టో అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పారు ఎన్నికల తర్వాత ఆ మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేశారని అన్నారు. మీ బిడ్డ జగన్‌కు అబద్దాలు చెప్పడం, మోసాలు చేయడం రాదని పేర్కొన్నారు. చంద్రబాబు, వారి కూటమిలా నోటికొచ్చిన అబద్ధాలు చెబుతాడు. నేను ఏదైనా చెప్పాడంటే చేసి చూపిస్తానంతే, చంద్రబాబులా మోసం చేయడం రాదన్నారు. జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదేనని, రూ.3 వేల ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదని నెలకు రూ. రెండు వేల కోట్లు పెన్షన్లకే ఇస్తున్నామన్నారు.

58 నెలలుగా పెన్షన్ల కోసం 90 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. చంద్రబాబు ప్రజల్ని మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తానంటాడు. కానీ ఈ మాటలు చేయగలిగేతేనే చెప్పాలన్నారు. 2014లో చంద్రబాబు హామీలిచ్చి మోసం చేశారన్నారు. మోసం చేసేవారిని నమ్మొద్దని ప్రజల్ని కోరుతున్నానని, చంద్రబాబు హామీల ఖర్చు లక్షా 40 వేల కోట్లు దాటిపోతున్నాయని, అందరినీ మోసం చేసేందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే.. పులి నోట్లో తలపెట్టినట్టేనని జగన్ చెప్పుకొచ్చారు.

Read More..

BREAKING: ఆంధ్రప్రదేశ్‌లో 50 కిలోల బంగారం పట్టివేత

Next Story

Most Viewed