బెయిలా?జైలా?: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు

by Disha Web Desk 21 |
బెయిలా?జైలా?: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది. స్కిల్ స్కామ్ కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు నాయుడు తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ ప్రారంభమైంది. ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశాల మేరకు సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. అయితే కౌంటర్‌లోని రెండు పేరాలపై జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం సోషల్ మీడియాలో పలు అంశాలను ప్రస్తావిస్తూ రెండు పేరాలలో తెలియజేశారు. ఈకేసుకు సంబంధించి జడ్జిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జడ్జి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరిగి కౌంటర్ ఫైల్ చేయాలని జడ్జి ఆదేశించారు. ఆ రెండు పేరాలను సవరిస్తేనే వాదనలు వింటామని జడ్జి తెలియజేశారు. దీంతో సీఐడీ తరఫు న్యాయవాదులు 20 నిమిషాల పాటు సమయం కోరారు. ఇందుకు జడ్జి అనుమతి ఇచ్చారు. దీంతో కోర్టు స్వల్ప బ్రేక్ ఇచ్చింది. ఇకపోతే చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై చంద్రబాబు నాయుడు తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్,, సీఐడీ తరఫున వివేకానంద వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు న్యాయస్థానాల్లో చుక్కెదురు అయ్యింది. ఈ నేపథ్యంలో బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు బెయిలా? లేక జైలా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సైతం ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. ఇదే సమయంలో కస్టీడీలో భాగంగా చంద్రబాబు నాయుడు విచారణకు సంబంధించి నివేదికను సీల్డ్ కవర్‌లో సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టు జడ్జికి అందజేశారు. చంద్రబాబు నాయుడును మరో రెండు రోజులపాటు కస్టడీ కోరుతూ సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed