మదనపల్లెలో అర్ధరాత్రి ఏటీఎం చోరీ.. గన్‌తో బెదిరించి మిషన్‌తో ఉడాయింపు

by Ramesh Naini |

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌ను ఏకంగా బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు.

మదనపల్లెలో అర్ధరాత్రి ఏటీఎం చోరీ.. గన్‌తో బెదిరించి మిషన్‌తో ఉడాయింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఎస్‌బీఐ (SBI) ఏటీఎం మిషన్‌ను ఏకంగా బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. అడ్డుకోబోయిన స్థానికులను తుపాకీతో బెదిరించి పరారైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నలుగురు సభ్యులున్న దొంగల ముఠా అర్ధరాత్రి వేళ ఏటీఎంను పెకలించి బొలెరో వాహనంలో (AP28TB2281) ఎక్కించారు. అనంతరం ఆ మిషన్‌ను కొంతదూరం తీసుకెళ్లి, అక్కడి నుంచి ఓ కంటైనర్‌లోకి మార్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

తుపాకీతో బెదిరింపు...

చోరీని గమనించిన స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, దొంగలు గన్ చూపించి భయభ్రాంతులకు గురిచేశారు. దొంగిలించబడిన ఏటీఎం మిషన్‌లో సుమారు రూ. 10 లక్షల నుంచి రూ. 13 లక్షల వరకు నగదు ఉన్నట్లు సమాచారం. కాగా, దుండగులు ఏటీఎంను ఎత్తుకెళ్తున్న దృశ్యాలను ఎదురింటి వారు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి. సమాచారం అందుకున్న వెంటనే అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు. సెల్‌ఫోన్ వీడియోలు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Next Story