- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీజు రీయింబర్స్మెంట్పై దద్దరిల్లిన అసెంబ్లీ.. వైసీపీని నిలదీసిన లోకేష్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఏపీ శానసమండలిలో అధికార కూటమి, వైసీపీ సభ్యుల మధ్య వాదోపవాదనలు కొనసాగాయి...

దిశ, వెబ్ డెస్క్: ‘వైసీపీ హయాంలో రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయి. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదు. వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్గా మారింది.’’ అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిలదీశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముందుగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న కాంటీన్లు మూసివేయబోమని సభలో చెప్పి మాటతప్పారని, ఇప్పుడు వైసీపీ పాలనలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు లేవంటూ నీతులు చెబుతున్నారని ఎత్తిచూపారు.
మంత్రి లోకేష్ స్పందిస్తూ
దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ మండలి వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు లేవని చెబుతున్నారని, 2020- 2021 ఏడాది క్యూ-4 పెండింగ్ 683.1 కోట్లు, 2023-24 క్యూ-2, క్యూ-3, క్యూ-4 బకాయిలు 1753.98 కోట్లు, 2023-24 ఏడాది గమనిస్తే.. ఎంటీఎఫ్ ఎరియర్లు కానీ చూస్తే సుమారు రూ.895 కోట్లు బకాయిలు పెట్టారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించినట్లు సభ్యులు చెబుతున్నారని, ప్రభుత్వం మారే సమయంలో రూ.645 కోట్ల బకాయిలు చెల్లించలేదని తెలిపారు. తాను రికార్డెడ్గా చెబుతున్నానని, విద్యాశాఖ మంత్రిగా మాట్లాడేందుకు తనకు హక్కు ఉందని, వైసీపీ రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి వెళ్లారన్నారు. ‘దీనిని నేను టేబుల్ చేస్తాను. మీరు రెడీగా ఉన్నారా’ అని వైసీపీ సభ్యులను లోకేశ్ నిలదీశారు.
దీనిపై బొత్స స్పందిస్తూ.. వైసీపీ హయాంలో రూ.4వేల కోట్ల బకాయిలు లేవని, రెండు వాయిదాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఇంటర్ విద్యను పట్టించుకోవడం లేదన్నారు. ఇందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని చెప్పారు.
చర్చకు సిద్ధం
‘‘నిజాలు చేదుగా ఉంటాయి. వైసీపీ సభ్యులు అబద్దాలు చెప్పి బయటకు వెళ్తున్నారు. ఇంటర్ విద్యపై దృష్టి పెట్టడం లేదంటున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 70వేల మంది విద్యార్థులు పెరిగారు. అదీ ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి. వైసీపీ ఐదేళ్ల కాలంలో కనీసం పుస్తకాలు బ్యాగ్స్ ఇవ్వలేదు. మధ్యాహ్న భోజనం రద్దు చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదు. మేం ఇంటర్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్దరించాం. పుస్తకాలు ఇస్తున్నాం. 10, ఇంటర్ విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నాం. వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్. ఈ తలుపు నుంచి వెళ్తారు. హాయిగా టీ తాగి ఆ తలుపు నుంచి వస్తారు. చిత్తశుద్ధి ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే సమాధానం ఇస్తున్నాం. సమస్యలు లేవని మేం చెప్పడం లేదు. మేం వినేందుకు సిద్ధంగా ఉన్నాం. పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. గతంలో మాదిరిగా నోరు మూసివేయడానికి కాదు మేం ఇక్కడ ఉంది. మేం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. పరదాలు కట్టుకుని మేం తిరగడం లేదు. అసెంబ్లీకి సీఎం వస్తుంటే ప్రజలు నవ్వుతూ చేతులు ఊపుతున్నారు. గత సీఎం 3వేల మంది పోలీసులను పెట్టేవారు రోడ్లపైన. యుద్ధవాతావరణం ఉండేది. ఇప్పుడు ప్రశాంతంగా, హాయిగా తిరగలుగుతున్నాం. ఇదీ మా చిత్తశుద్ధి. విపక్ష నేతను పిలిపించాలి. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదు. వైసీపీ హయాంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరం అయ్యారు. ప్రశ్నించే హక్కు నాకు ఉంది. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం.’’ అని మంత్రి లోకేశ్ చెప్పారు.






