- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) ప్రయాణికులకు తీపి కబురు అందించింది. సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం ఈ ఏడాది సుమారు 9,240 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (Operations) అప్పలరాజు వెల్లడించారు. ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల నుంచి ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం భారీ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల నుంచి ఈ బస్సులు నిరంతరం నడుస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన పట్టణాల నుంచి కూడా ఇతర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను అనుసంధానం చేస్తున్నట్లు ఆయన వివరించారు.
పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తున్నట్లు అప్పలరాజు తెలిపారు. ఈ 9,200కు పైగా బస్సుల నిర్వహణ ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారని ఆర్టీసీ యంత్రాంగం ధీమా వ్యక్తం చేస్తోందన్నారు. ప్రైవేట్ వాహనాల్లో అధిక ఛార్జీల భారం పడకుండా, ఆర్టీసీ బస్సులను ఆశ్రయించి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో అదనపు సిబ్బందిని నియమించి, బస్టాండ్ల వద్ద సరైన పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకుని, రిజర్వేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.






