AP | ఆలయాల పరిరక్షణ.. ప్రక్షాళన చేపడుతున్నాం : హోం మంత్రి అనిత

by Thanuru Gopichand |

ఎన్డీయే కూటమి ప్రభుత్వ (NDA Government) పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల పరిరక్షణతో పాటు ప్రక్షాళన చేపడుతున్నాం అని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) అన్నారు.

AP | ఆలయాల పరిరక్షణ.. ప్రక్షాళన చేపడుతున్నాం : హోం మంత్రి అనిత
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్డీయే కూటమి ప్రభుత్వ (NDA Government) పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల పరిరక్షణతో పాటు ప్రక్షాళన చేపడుతున్నాం అని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) అన్నారు. సింహాచలంలో వెలిసిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయాన్ని శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు, ఆర్చన జరిపించారు. అనంతరం ఆలయ పండితులు హోం మంత్రితో పాటు వారి కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం హోం మంత్రి ఆలయంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, ఇతర మౌలిక వసతులను దేవస్థానం అధికారులు పకడ్బందీగా సిద్ధం చేయాలని సూచించారు. పరిశీలనలో భాగంగా వారు క్యూలైన్‌లో వేచి ఉన్న సామాన్య భక్తులతో హోం మంత్రి వంగలపూడి అనిత నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాల గురించి, దేవస్థానం ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులు సైతం అధికారుల పనితీరు పట్ల తమ అభిప్రాయాలను హోం మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ​ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఆలయాల పరిరక్షణ, ప్రక్షాళన కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ప్రతీ ఆలయంలో ప్రధాన ఉత్సవాలను పూర్వవైభవంతో, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వివరించారు. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే పండుగలు, పర్వదినాల్లో కట్టుదిట్టమైన భద్రత, మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ, ఆలయాల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడమే తమ ప్రభుత్వ ధ్యేయమని హోం మంత్రి స్పష్టం చేశారు. సింహాచలం దేవస్థానానికి సంబంధించి రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులపై కూడా అధికారులతో చర్చించామన్నారు.

Next Story