జగన్ సర్కార్‌కు పొంచివున్న గండం.. అయినా సమర్థించుకుంటున్న వైసీపీ నేతలు!!

by Disha Web Desk 2 |
జగన్ సర్కార్‌కు పొంచివున్న గండం.. అయినా సమర్థించుకుంటున్న వైసీపీ నేతలు!!
X

‘‘కరెంటు చార్జీలు భరించలేకపోతున్నాం. ఇప్పుడే ఇలా ఉంది. ఇక వేసవి రోజుల్ని తల్చుకుంటే భయమేస్తోంది. ప్రతినెలా చార్జీలు పెంచడమేంటని అధికారులను అడిగితే.. ప్రభుత్వం చార్జీలు ఎక్కడ పెంచిందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. సర్దుబాటు చార్జీల వల్ల మీకు పెరిగినట్లు కనిపిస్తోందని విద్యుత్​సిబ్బంది సెలవిస్తున్నారు.’’ దాదాపు ప్రతీ సగటు కుటుంబ యజమానికి అర్థంకాని సమస్య ఇది. ఒక నిర్ణీత వ్యవధిలో విద్యుత్​సరఫరా అయింది ఎంత.. బిల్లుల ద్వారా వచ్చిన రాబడి ఎంతనేది లెక్కిస్తారు. రావాల్సినంత సొమ్ము రాకుంటే తదుపరి ఏడాది ట్రూ అప్​చార్జీల పేరిట బాదేస్తారు. మరి ఎంత కరెంటు వాడుకుంటే అంతకు బిల్లు కడుతున్నప్పుడు తేడా ఎందుకొస్తుందని ప్రశ్నించకూడదు. మోడీ, జగన్​చెబుతున్నారు కాబట్టి విని తలూపడమే. కాదుకూడదంటే కనెక్షన్​పీకేయొచ్చు. ఇంకో మాట మాట్లాడితే కేసులు పెట్టి జైలుకు పంపొచ్చు. ఇప్పటిదాకా పట్టభద్రులే ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. ఇక సామాన్య జనం నుంచి కూడా వైసీపీకి షాక్​తప్పదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: విద్యుత్​చార్జీల బాదుడుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముద్దుగా పెట్టుకున్న ట్రూ అప్​చార్జీల పేరుతో యూనిట్‌కు 40 పైసల వంతున నేటి (ఏప్రిల్ 1) నుంచి వడ్డించనున్నారు. ఒక్కసారో.. ఒకనెలో కాదు. ప్రతి నెలా ట్రూఅప్​చార్జీలుంటాయి. ప్రతీ వినియోగదారుడికి సాధారణంగా వచ్చే కరెంటు బిల్లులో అదనంగా సుమారు వంద నుంచి రెండొందలు పెరగొచ్చు. 2020–21 ఏడాదికి సంబంధించి విద్యుత్​పంపిణీ సంస్థలు సరఫరా చేసిన కరెంటుకు, బిల్లుల ద్వారా వచ్చిన రాబడికి మధ్య వ్యత్యాసాన్ని ట్రూఅప్​చార్జీల పేరుతో వసూలు చేస్తున్నట్లు ఇప్పటిదాకా ప్రభుత్వం చెబుతోంది. దీనికింద యూనిట్‌కు 67 పైసలు పెంచి రూ.3,082 కోట్లు వసూలు చేస్తోంది. అంతకుముందు 2016-19 వరకు 36 నెలలకు సంబంధించి యూనిట్‌కు 25 పైసలు చొప్పున రూ.1400 కోట్లు వసూలు చేశారు. ఇక ఈ ట్రూఅప్​చార్జీలు అనేవి ఏడాది తర్వాత కాకుండా ప్రతీ నెలా ఉంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పీక్ అవర్స్‌లో మరో బాదుడు

ప్రస్తుతం ఈ బాదుడు చాల్లేదేమో.. తాజాగా కేంద్ర విద్యుత్​రెగ్యులేటరీ కమిషన్ అన్ని రాష్ట్రాలకు ఓ ప్రతిపాదన పంపింది. అదేమిటంటే పీక్​అవర్స్‌లో లోడు పెరుగుతుంది. అలాంటి సమయంలో అదనంగా కరెంటు కొనాల్సి వస్తుంది. అందువల్ల వ్యాపారంలో డిమాండ్​సప్లై సూత్రాన్ని అనుసరించి ఆయా సమయాల్లో వినియోగించిన కరెంటును బట్టి విద్యుత్​చార్జీలు పెంచాలని అన్ని రాష్ట్రాల రెగ్యులేటరీ కమిషన్లకు మార్గదర్శకాలు పంపింది. నెల రోజుల్లోపల వీటిపై చర్చించి అంగీకారం తెలపాలని కోరింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే లోడు తక్కువగా ఉన్నప్పుడు వాడుకున్న కరెంటుకు ఓ ధర, లోడు మధ్యస్తంగా ఉన్నప్పుడు మరో ధర, లోడు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకో ధర ప్రకారం చార్జీలు బాదే అవకాశాలున్నాయి.

యూనిట్ కొనుగోలు ధర రూ.50 పైనే..

ఇవేనా.. జనం జేబులు కొట్టడానికి కేంద్రం వద్ద బోలెడు ఐడియాలున్నాయి. నేటిదాకా అత్యంత తక్కువ ధరకు ఏపీ జెన్​కో, ప్రభుత్వ థర్మల్​విద్యుత్​కేంద్రాలు కరెంటును ఉత్పత్తి చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. చాలక బయట సంస్థల నుంచి కొనాలనుకున్నప్పుడు యూనిట్​ధర రూ.12 కు మించకూడాదనే నిబంధన ఉంది. దాన్ని కాలరాసి యూనిట్​ధరను రూ.50 వరకు కొనవచ్చని కేంద్ర విద్యుత్​రెగ్యులేటరీ కమిషన్​మార్గదర్శకాలు జారీ చేసింది. అంటే అప్పుడు యూనిట్​వినియోగ చార్జీ ఎంతవుతుందో ఊహకే అందడం లేదు. సంపన్న శ్రేణికి దగ్గరగా ఉండే ఎగువ మధ్య తరగతి సైతం నాలుగు బల్బులు పెట్టుకొని కరెంటు వాడుకోవాలి. సామాన్యులు లాంతర్ల వెలుతురులో గడపాల్సిందే.

అదానీ బొగ్గుకు విదేశీ గిరాకీ..

ఇప్పటిదాకా ప్రధాని మోడీ ఏం చెప్పినా సీఎం జగన్​తల అడ్డంగా ఊపింది లేదు. ఈ ప్రతిపాదనలను తు.చ. తప్పకుండా అమలు చేయడానికి వెనుకాడకపోవచ్చు. ఇదే కాదు. ప్రభుత్వ రంగంలోని థర్మల్​విద్యుత్​కేంద్రాలకు అవసరమైన బొగ్గులో 10 నుంచి 20 శాతం తప్పనిసరిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. అంటే ఇక్కడ టన్ను రూ.5 వేలకు దొరికే దాన్ని రూ.13 వేల నుంచి 20 వేల చొప్పున విదేశాల నుంచి కొనాలి. విదేశాల్లో అదానీ బొగ్గుకు అలా గిరాకీని పెంచే కార్యక్రమం ఇది. ఈపాటికే స్మార్టు మీటర్ల తయారీని అదానీ మొదలు పెట్టారు. ఇదిగాక మొన్నామధ్యనే 7 వేల మెగావాట్ల సోలార్​విద్యుత్‌ను అదానీ నుంచి 30 ఏళ్ల పాటు కొనేట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇంకా రాయలసీమలో జలవిద్యుత్‌ను హైడ్రో పంపుడ్​స్టోరేజ్​కింద నిల్వ చేసే ప్రాజెక్టుకూ ఆమోదం తెలిపింది. రానున్న కాలంలో మన ఇంట్లో కరెంటు స్విచ్​అదానీ చేతిలో ఉండబోతోంది.

ఇది గ్యాస్ సబ్సిడీ లాంటిదే.. మరో మోసం

ఒకప్పుడు పెట్రోలు, డీజిల్​ధరలు పెంచినప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్​ఆయిల్ రేట్లు తగ్గినప్పుడు వినియోగదారులకు తగ్గిస్తామన్నారు. అన్నీ ఉత్త కబుర్లే. ఏనాడూ తగ్గించింది లేదు. క్రూడ్​ఆయిల్​ధరలు తగ్గినప్పుడల్లా ఎక్సైజ్​సుంకం పెంచుకుంటూపోయారు. వంట గ్యాస్ సబ్సిడీ రేట్లు పెంచినప్పుడు సబ్సిడీ వినియోగదారుడి బ్యాంకు ఖాతాలకు వేస్తామని మరో మోసం చేశారు. ఇప్పుడు కరెంటు వంతు వచ్చింది. ఎన్నికలకు ముందు జగన్​బాదుడే బాదుడంటూ టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తాము వస్తే 200 యూనిట్లలోపు వినియోగించే ప్రతీ ఒక్కరికీ ఉచితమని సెలవిచ్చారు. ఇప్పుడేమో చార్జీలు బాదేస్తున్నారు. మోడీ ధరలు పెంచుతున్నా ఓట్లు వేస్తున్నారుగా అంటూ కొందరు వైసీపీ నేతలు ముక్తాయింపునిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో మతాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నిసార్లయినా గెలవొచ్చు. రాష్ట్రంలో వైసీపీకి ఆ పప్పులు ఉడకవు. ఇక్కడ ప్రజలు యూనిట్‌కు రెండు రూపాయలు పెంచితేనే ప్రభుత్వాలను తల్లకిందులు చేసిన చరిత్ర ఉంది. వైసీపీకి విద్యుత్​గండం పొంచి ఉందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: బీజేపీ నేతపై వైసీపీ దాడి పిరికిపంద చర్య: సోము వీర్రాజు


Next Story

Most Viewed