వైఎస్ జగన్ పల్నాడు పర్యటన.. వెలుగులోకి మరో సంచలనం

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-24 07:29:14  IST  )

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన రోజుకో మలుపు తిరుగుతుంది.

వైఎస్ జగన్ పల్నాడు పర్యటన.. వెలుగులోకి మరో సంచలనం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన రోజుకో మలుపు తిరుగుతుంది. ఇటీవల వైఎస్ జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ళలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో వైఎస్ జగన్ కారు కింద పడి సింగయ్య అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే పలువురి పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.

అసలు విషయంలోకి వెళితే.. తెల్లజర్ల మధు(22) అనే యువకుడు అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోవడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీంతో అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించాలని వైద్యులు సలహా ఇచ్చారు. అయితే.. ఆ సమయంలోనే మాజీ సీఎం జగన్ రావడంతో సత్తెనపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అప్పటికే ఆ మార్గంలో ఉన్న అంబులెన్స్‌లో ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అతనికి వెంటనే అత్యవసర వైద్యం అందించాల్సి ఉంది. కానీ, గుంటూరుకు తరలించే క్రమంలో మధు ఉన్న అంబులెన్స్ ర్యాలీ కారణంగా అక్కడే ట్రాఫిక్‌లో నిలిచిపోయింది. దీంతో ఆ యువకుడు మృతి చెందాడు. దాదాపు గంటకు పైగా ట్రాఫిక్‌లో అంబులెన్స్ నిలిచిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story