లెక్క తప్పింది.. పవన్​ వ్యాఖ్యల పై వాలంటీర్ల నిరసన..

by Disha Web Desk 20 |
లెక్క తప్పింది..  పవన్​ వ్యాఖ్యల పై వాలంటీర్ల నిరసన..
X

దిశ, ఏపీ బ్యూరో : ‘నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది..’ పవన్ కల్యాణ్ నటించిన ఓ సినిమాలోని పాపులర్ డైలాగ్ ఇది. కానీ, వాలంటీర్ల వ్యవస్థ పై చేసిన ఆరోపణల్లో ఆయన లెక్క తప్పినట్లు కన్పిస్తోంది. వాలంటీర్లు సేకరించే సమాచారం వల్లే యువతులు అదృశ్యమవుతున్నారని జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై వాలంటీర్ల నిఘా ఎందుకని నిలదీశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు స్పందించారు. పవన్​ దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులు వాలంటీర్లకు మద్దతుగా పవన్​పై ఎదురు దాడి చేస్తున్నాయి. స్వచ్చంద ముసుగులో తాము నిలువు దోపిడీకి గురవుతున్నామనే ఆక్రోశం వాలంటీర్లలో ఉండేది. పవన్ వ్యాఖ్యలతో అది తొలగిపోయింది. ఎన్నికల ఏడాదిలోనైనా మా భవితవ్యం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీయాలని వారు అనుకున్నారు. ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న వాలంటీర్లు అధికార పార్టీ చేజారకుండా పవన్​ కృషి చేసినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్​ వైసీపీకి అనుకూల శత్రువా అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

అసలే నిరుద్యోగ సమస్య. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కాలం. వైసీపీ సర్కారు ప్రవేశ పెట్టిన పాలనా సంస్కరణలతో సుమారు రెండున్నర లక్షల మంది వలంటీర్లుగా చేరారు. ఇది ఉద్యోగం కాదు.. స్వచ్చంద సేవలాంటిదని ప్రభుత్వం ముందే ప్రకటించింది. అయినా వేణ్నీళ్లకు చన్నీళ్లన్నట్లు రూ. 5 వేల వేతనానికి పనిచేయడానికి సిద్దమయ్యారు. దాదాపు వలంటీర్లంతా అధికార పార్టీకి చెందిన వాళ్లే. ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వాళ్లనే నియమించారు. అందుకే తొలినాళ్లలో వాళ్లపై విమర్శలు చేసి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాలిక్కరుచుకున్నారు. తర్వాత తమ ప్రభుత్వం వచ్చాక వాళ్లకు మెరుగైన వేతనంతో మంచి భవిష్యత్తును ఇస్తామని హామీనిచ్చారు.

వారి విధులు అనేకం..

ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థలో భాగంగా ప్రతి 70 కుటుంబాలకు ఒక వాలంటీర్లను నియమించారు. సంక్షేమ పథకాలను అందించడంలో కీలకంగా మారారు. చెత్త, ఇంటి పన్నుల వసూళ్లలో పాల్గొంటున్నారు. ఏ ధ్రువీకరణ పత్రం కావాలన్నా వలంటీరు చేసి పెడుతున్నాడు. చివరకు ఆ వీధిలో కరెంటు పోయినా.. ఏ చిన్న చోరీ జరిగినా వాలంటీర్లు ముందుండాల్సి వస్తోంది. రేషన్​ సరకులు అందించడంలోనూ వలంటీర్ల కృషి ఉంది. డ్రైనేజీ క్లీనింగ్​ చేయకున్నా వలంటీర్ కు కాల్​ చేసే స్థాయికి ఎదిగారు. ఇంతలా వలంటీర్లు ప్రజలకు తలలో నాలికలా మారారు.

వలంటీర్లకు శత్రువయ్యాడు..

నెలంతా పనిచేసి ఇలా అత్తెసరు వేతనంతో ఎన్నాళ్లు పనిచేయాలి ? జీవితంలో స్థిరపడేదెప్పుడు ? అనే ప్రశ్నలు వలంటీర్లలో మొదలయ్యాయి. రెండేళ్ల క్రితమే ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డెక్కారు. అప్పుడు సీఎం జగన్ ఏవో అవార్డులు ప్రకటించి శాంతింపజేశారు. ఎన్నికల ఏడాదిలో మా పరిస్థితేంటని మళ్లీ మరోసారి ప్రభుత్వాన్ని నిలదీయాలనుకున్నారు. వాళ్ల ఆశలపై పవన్​ నీళ్లు చల్లారని కొందరు వలంటీర్లు వాపోతున్నారు. ప్రస్తుతం వలంటీర్లకు పవన్​ శత్రువయ్యాడు. వైసీపీ నేతలు వాళ్లకు మరింత దగ్గరయ్యారు. పవన్​ తదుపరి లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగులేనా అంటూ విపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు.



Next Story

Most Viewed