Kalyandurgam: ట్రైల్ రన్ వేసి 6 నెలలు.. ఇంకా అందుబాటులోకి రాని రైలు

by Disha Web Desk 16 |
Kalyandurgam: ట్రైల్ రన్ వేసి 6 నెలలు.. ఇంకా అందుబాటులోకి రాని రైలు
X

దిశ, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గం నుండి కర్ణాటక రాష్ట్రం టుంకూరు వరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ రూ. 2400 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే ప్రాజెక్ట్ పనులు చేపట్టింది. 2011 - 12 సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించింది. రాయదుర్గం, కళ్యాణదుర్గం, కదిరిదేవరపల్లి , కంబదూరు, కర్ణాటక కె.రాంపురం వరకు దాదాపు 80 కిలోమీటర్ల మేరకు రైల్వే లైన్ విస్తరణ పనులు పూర్తి అయ్యాయి.

అయితే ఈ పాటికే టుంకూరు వరకు రైల్వే లైన్, స్టేషన్ విస్తరణ తదితర ప్రాజెక్ట్ పనులు పూర్తికావాల్సి ఉండగా కరోనా సంక్షోభం వల్ల ఈ ప్రాజెక్ట్ పనులు 2027 సంవత్సరం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. కదిరిదేవరపల్లి నుంచి కంబదూరు, రాంపురం వరకు జరిగిన రైల్వే ట్రాక్ పనులను ఈ ఏడాది జనవరిలో పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు రైలు ట్రాక్ పరిశీలన కోసం అనుమతినిచ్చారు. ఫిబ్రవరి 19న రైల్వే అధికారులు ట్రైల్ రన్ నిర్వహించి రైలు సర్వీసులను నడపడం కోసం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

అయితే ట్రైల్ రన్ నిర్వహించి 6 నెలలు అవుతున్నా రైలు సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో కంబదూరు ప్రాంత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాంపురం రైల్వే స్టేషన్ పనులు ఆలస్యం కావడంతో రైల్వే సేవలు రోజు రోజుకీ వెనక్కి వెళ్తున్నాయని అక్కడి గ్రామస్తులు అధికారులపై మండిపడుతున్నారు. రైల్వే కాంట్రాక్టర్లు తగిన సమయంలో పనులు చేయకపోవడం, పలు కారణాల వల్ల రైలు సర్వీసులను ప్రారంభించడానికి ఆలస్యం అవుతున్నట్లు రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్ విస్తరణ పనులను త్వరితిగతిన పూర్తి చేసి రైల్వే సేవలను అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుచున్నారు.


Next Story

Most Viewed