ప్రజలంతా గాంధీజీ జీవితాన్ని స్పూర్తిగా తీసుకోవాలి

by Disha Web Desk 7 |
ప్రజలంతా గాంధీజీ జీవితాన్ని స్పూర్తిగా తీసుకోవాలి
X

దిశ, డైనమిక్ బ్యూరో : అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని రాష్ట్ర గవర్నర్ బీబీ హరిచందన్ అన్నారు. జాతిపిత వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నామని చెప్పుకొచ్చారు. విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాలులో సోమవారం గాంధీజీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మునికి ఘన నివాళి అర్పించారు. అనంతరం గవర్నర్ హరిచందన్ మాట్లాడారు. 'సర్వజన హితం నా మతం, అంటరానితనం, అంతః కలహాలను అంతం చేసేందుకే నా ఆయువు అంకితం' అని గాంధీజీ అన్నారని గుర్తు చేశారు.

నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించారని.. అదే మార్గంలో భారతావనికి స్వాతంత్య్రం అందించారని కొనియాడారు. 1948 జనవరి 30న బిర్లా హౌస్ వద్ద నాథూరామ్ గాడ్సే మహాత్ముడిపై కాల్పులు జరపగా.. హే రామ్ అంటూ జాతిపిత ప్రాణాలు విడిచారని గవర్నర్ హరిచందన్ గుర్తు చేసుకున్నారు. మహాత్ముడి వర్ధంతిని దేశవ్యాప్తంగా షహీద్ దివస్‌గా జరుపుకుంటున్నామని.. ప్రజలంతా గాంధీజీ జీవితాన్ని స్పూర్తిగా తీసుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీజీ అనుసరించిన శాంతియుత మార్గం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, సంయిక్త కార్యదర్శి సూర్యప్రకాశ్, ఉప కార్యదర్శి నారాయణ స్వామి, రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

READ MORE

'సీఐడీ కేసులకు భయపడం..ఎదుర్కొంటాం'

Next Story

Most Viewed