విశాఖ తీరంలో అరుదైన అతిథి.. రుషికొండ బీచ్‌లో భారీ ‘వేల్ షార్క్’

by Ramesh Naini |

సాగర నగరం విశాఖపట్నంలోని రుషికొండ తీరంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్ర గర్భంలోని అద్భుతాలను చూసేందుకు వెళ్లిన స్కూబా డైవర్లకు, అంతరించిపోతున్న జాతికి చెందిన భారీ ‘వేల్ షార్క్’ (తిమింగలం చేప) కనిపించింది.

విశాఖ తీరంలో అరుదైన అతిథి.. రుషికొండ బీచ్‌లో భారీ ‘వేల్ షార్క్’
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాగర నగరం విశాఖపట్నంలోని రుషికొండ తీరంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్ర గర్భంలోని అద్భుతాలను చూసేందుకు వెళ్లిన స్కూబా డైవర్లకు, అంతరించిపోతున్న జాతికి చెందిన భారీ ‘వేల్ షార్క్’ (తిమింగలం చేప) కనిపించింది. సుమారు 10 మీటర్ల పొడవున్న ఈ భారీ చేపను చూసి డైవర్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి, ఉత్సాహానికి లోనయ్యారు.

స్కూబా డైవర్లకు అరుదైన అనుభవం..

చిన్న రుషికొండ సమీపంలో ఇద్దరు స్టూడెంట్లతో కలిసి ఇన్‌స్ట్రక్టర్లు స్కూబా డైవింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. చేపల గుంపును వెంబడిస్తూ ఈ వేల్ షార్క్ తీరానికి సమీపంలోకి వచ్చినట్లు డైవర్లు గుర్తించారు. వారి పక్క నుంచే ఈ భారీ చేప ఈదుకుంటూ వెళ్లడం తమ జీవితంలో మర్చిపోలేని ‘వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్’ అనుభవమని డైవింగ్ బృందం సంతోషం వ్యక్తం చేస్తూ వీడియోను షేర్ చేసింది.

అంతరించిపోతున్న జాతి..

సాధారణంగా వేల్ షార్క్‌లు అంతరించిపోతున్న జాతుల (Endangered Species) జాబితాలో ఉన్నాయి. ఇవి మనుషులకు ఎటువంటి హాని చేయవని నిపుణులు చెబుతున్నారు. ఆహారం కోసం సముద్ర ఉపరితలం వైపు వచ్చే క్రమంలో ఇవి డైవర్ల కంట పడుతుంటాయి. విశాఖ తీరంలో ఇలాంటి అరుదైన జీవులు కనిపించడం ఇక్కడి సముద్ర పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉందనడానికి సంకేతమని నిపుణులు భావిస్తున్నారు.

Next Story