గుండెల్ని పిండేసే విషాదం... అడవిలో తండ్రి మృతదేహం పక్కన ఐదేళ్ల బాలుడు

by Vemula.Srinu Prasad |

అన్నమయ్య జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో గాంధీ అనే వ్యక్తిని ఐదేళ్ల కుమారుడు సందీప్ కళ్లముందే గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ..

గుండెల్ని పిండేసే విషాదం... అడవిలో  తండ్రి మృతదేహం పక్కన ఐదేళ్ల బాలుడు
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamaiah District)లో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతం(Boyakonda Forest Area)లో గాంధీ అనే వ్యక్తిని ఐదేళ్ల కుమారుడు సందీప్ కళ్లముందే గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. చుట్టూ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో, ఆ చిన్నారి తన తండ్రి విగతజీవిగా పడి ఉన్నాడన్న చేదు నిజాన్ని జీర్ణించుకుంటూ రాత్రంతా ఆ మృతదేహం పక్కనే గడిపాడు. భయం భయంగానే తెల్లవార్లూ తండ్రి వెంటే ఉండిపోయిన ఆ బాలుడి పరిస్థితి స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది.

ఆకలి, భయం వేధిస్తున్నా

తెల్లవారిన తర్వాత ఆ చిన్నారి చూపిన ధైర్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆకలి, భయం వేధిస్తున్నా వెనకడుగు వేయకుండా, దట్టమైన అటవీ మార్గంలో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర ఒంటరిగా నడిచాడు. అలా నడుచుకుంటూ సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రానికి చేరుకున్న సందీప్, అక్కడ ఉన్న టీచర్‌కు తన తండ్రికి జరిగిన ఘోరాన్ని వివరించాడు. బాలుడి మాటలు విని నిర్ఘాంతపోయిన టీచర్.. వెంటనే బాలుడిని తీసుకుని అడవిలోకి వెళ్లగా, అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న గాంధీ మృతదేహం కనిపించింది.

చిన్నారిని చూసి చలించిపోయిన ప్రజలు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అంగన్‌వాడీ టీచర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ‘‘అస్సలు గాంధీని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది?, పాత కక్షలా లేక మరేదైనా కారణమా?’’ అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. కన్నతండ్రిని కోల్పోయి, ఆ భయానక వాతావరణంలో రాత్రంతా గడిపిన ఆ చిన్నారిని చూసి జిల్లా ప్రజలు చలించిపోయారు.

Next Story