కొంపముంచిన మటన్ బిర్యానీ.. 17 మంది ఆస్పత్రిపాలు

by Disha Web Desk 7 |
కొంపముంచిన మటన్ బిర్యానీ.. 17 మంది ఆస్పత్రిపాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఓ ఫంక్షన్‌లో మిగిలిపోయిన మటన్ బిర్యానీ కొంపముంచింది. ఏకంగా 17 మందిని ఆస్పత్రికి పాలయ్యేలా చేసింది. ఈ ఘటన ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శింగవరం గ్రామంలో జరిగింది. గ్రామస్థులు చెప్తున్న వివరాల ప్రకారం.. బుధవారం భీమడోలు మండలం గుండుగొలనులో ఓ ఫంక్షన్ జరిగింది. అయితే ఆ ఫంక్షన్‌లో మిగిలిపోయిన మటన్ బిర్యానీని గురువారం ఉదయం శింగవరం గ్రామానికి చెందిన పలువురు పేదలకు పంపిణీ చేశారు. అయితే ఆహారం తిన్న వారంతా గురువారం మధ్యాహ్నం సమయంలో వాంతులు, కడుపు నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

బాధితులకు స్థానిక ఆర్‌ఎంపి కొంత మందికి చికిత్స అందించారు. అయితే బాధితుల సంఖ్య మరింత పెరగడంతో గ్రామస్థులు 108కు సమాచారం అందించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన 13 మందిని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో పది మంది చిన్నారులు, ఓ గర్భిణి, ఇద్దరు పురుషులు ఉన్నారు. మరో నలుగురికి ఇంటి వద్దే వైద్యం అందించారు. ప్రస్తుతం వీరి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియజేశారు. మటన్‌ బిర్యాని వల్లే సమస్య వచ్చిందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి పరామర్శించారు. ఏలూరు ఆర్‌డిఒ పెంచల కిషోర్‌కుమార్‌ వైద్యాధికారులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. శుక్రవారం కూడా ఆస్పత్రిలో మరికొంతమంది చికిత్సపొందుతున్నారు.

Next Story