కేసీఆర్ పాలనలోనే ఆంధ్ర జలదోపిడీ : నాగం

by  |
Nagam Janardhan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీమాంధ్ర పాలనలో కంటే కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, కృష్ణానది జలాలను ఆంధ్రకు దోచిపెడుతున్నారని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. గాంధీ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు ముందు చూపు లేకపోవడం వల్లే కృష్ణా పరివాహక ప్రాంత వాసులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. కృష్ణా జలాలను వాడుకునే హక్కు కృష్ణా నది జలాల ప్రాంతావాసులకు మాత్రమే ఉందన్నారు.

కేసీఆర్ అసమర్ధతతో మహబూబ్ నగర్‌లోని ప్రాజెక్టులన్ని ఎండిపోతున్నాయని, రాయలసీమకు నీటి తరలింపు ఎక్కువైందన్నారు. ఆంధ్రా నీటిపారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ బాహాటంగా కృష్ణా జలాలు తీసుకుపోతున్నాం అని ప్రకటిస్తున్నా అడ్డుకోని అసమర్ధ సీఎం కేసీఆర్ అని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌లే తెలంగాణ ముంచుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది కేసీఆర్ కుటుంబం కోసం అన్నట్లుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ మేల్కొని కృష్ణా జలాల్లో వాటా కోసం కృషి చేయాలని, అక్రమ నీటి తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.



Next Story