బంగారం కోసం దంపతుల దారుణం.. ఒంటరిగా ఉందని తీసుకెళ్లి..!

by  |
బంగారం కోసం దంపతుల దారుణం.. ఒంటరిగా ఉందని తీసుకెళ్లి..!
X

దిశ, జడ్చర్ల: నాలుగు తులాల బంగారం కోసం పక్షవాతం వచ్చిన నోటి నుంచి మాట మాట్లాడని వృద్ధురాలిని హత్య చేశారు పక్కింటి దంపతులు. ఈ ఘటన షాద్‌నగర్‌ మండలంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం‌లోని షేర్‌గూడ గ్రామానికి చెందిన పద్మమ్మ (60). భర్త కృష్ణారెడ్డి కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఇద్దరి కూతుళ్ల వివాహం చేసిన పద్మమ్మ తన ఇంట్లోనే ఒంటరిగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం క్షీణించింది. పక్షవాతం వచ్చి నోటి మాట పడిపోయింది.

వ్యాధిని నయం చేసుకునేందుకు హాస్పిటళ్లు, నాటు వైద్యుల చుట్టూ తిరిగినా ఎలాంటి మార్పు రాలేదు. ఇది గమనించిన పక్కింటి వడ్డే తిరుపతయ్య-శారద దంపతులు పద్మమ్మ మెడలో ఉన్న బంగారంపై కన్నేశారు. పద్మమ్మకు మాయమాటలు చెప్పి తమకు తెలిసిన చోట పక్షవాతానికి నాటు వైద్యం చేయిస్తే.. నోటి మాట వస్తుందని నమ్మబలికారు. ఈ నేపథ్యంలోనే అక్బోబర్ 4వ, తేదీన వృద్ధురాలిని భార్యాభర్తలు ఇద్దరూ తమ వెంటబెట్టుకొని మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం దోనూర్-సింగం దొడ్డి గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారు నగలను తీసుకొని మృతదేహాన్ని పక్కనే ఉన్న ముళ్లపొదల్లో పడేశారు.

అనంతరం మృతురాలి కూతురు లక్ష్మి.. తల్లి కనిపించడం లేదని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షేర్‌గూడ గ్రామంలోని వృద్ధురాలి చుట్టుపక్కల వారిని విచారించారు. అనుమానంతో ఆదివారం వడ్డే తిరుపతయ్య-శారదా దంపతులను కూడా అదుపులోకి తీసుకొని తమదైన రీతిలో విచారణ చేపట్టగా.. బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో సోమవారం నిందితులు హత్య చేసిన ప్రదేశాన్ని పోలీసులకు చూపడంతో మిడ్జిల్ పోలీసుల సహాయంతో మృతదేహాన్ని గుర్తించి.. పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు షాద్‌నగర్ రూరల్ ఎస్సై సుందరయ్య తెలిపారు. వీరికి మిడ్జిల్ ఎస్సై జయప్రసాద్ తమ వంతు కృషి చేశారని వివరణ ఇచ్చారు.


Next Story

Most Viewed