అన్ని ఊర్లు ఇలాగే ఉండాలి.. శభాష్ బొప్పారం

by  |
అన్ని ఊర్లు ఇలాగే ఉండాలి.. శభాష్ బొప్పారం
X

దిశ, ఆదిలాబాద్: కరోనా కట్టడి కోసం ఆ ఊరి ప్రజలు తీసుకుంటున్న నిర్ణయాలతో అందరిచేత మెప్పు పొందుతున్నారు. గ్రామానికి విదేశాల నుంచి వచ్చే వారు, ఇతర ప్రాంతాలకు కూలీ పనుల కోసం వలస వెళ్లిన వారు గ్రామానికి వస్తే వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆ సెంటర్‌ను గ్రామస్తులు అందరూ కలిసి సొంత డబ్బులతో నడుపుతున్నారు. అక్కడ ఉండే వారి భోజన వసతి మొదలుకొని అన్ని ఖర్చులను గ్రామస్తులే భరిస్తున్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్ బొప్పారం గ్రామస్తులు ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా పాఠశాల మూసి ఉండడంతో దాన్ని ఐసోలేషన్ సెంటర్‌గా మార్చారు. గ్రామ సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకొని కేంద్రాన్ని సజావుగా నడుపుతున్నారు. ఈ గ్రామం నుంచి సుమారు రెండు వందల మంది దాకా గల్ఫ్ దేశాలకు వెళ్లారు. వీరంతా ఇప్పుడు స్వగ్రామానికి వస్తున్నారు. కరోనా భయంతో వీరిని ఇళ్లలోకి వెళ్లనివ్వకుండా గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్‌లో ఉంచుతున్నారు. దీన్ని విదేశాల నుంచి వచ్చే వారితో పాటు ముంబాయి, నాగపూర్, నాందేడ్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లి వస్తున్న వారు ఈ కేంద్రంలోనే ఆశ్రమం పొందుతున్నారు. అన్ని గ్రామాలు ఇలాగే ఉంటే… కరోనా దరిచేరదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామస్తులు తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ సహా పలువురు అభినందిస్తున్నారు.



Next Story

Most Viewed