పాల ధరను పెంచిన అముల్.. లీటర్ ఎంతంటే..!

by  |
పాల ధరను పెంచిన అముల్.. లీటర్ ఎంతంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద పాల ఉత్పత్తుల సంస్థ, డెయిరీ బ్రాండ్ అముల్ కంపెనీ జులై 1 నుంచి దేశవ్యాప్తంగా పాల ధరను లీటర్‌కు రూ. 2 చొప్పున పెంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత అముల్ సంస్థ పాల ధరలను పెంచుతోంది. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ధరలను పెంచే నిర్ణయం తీసుకున్నామని, ప్యాకెజింగ్, లాజిస్టిక్స్, వస్తువుల ఖర్చులు పెరిగిన కారణంగానే ఈ పెంపు అమలు చేస్తున్నట్టూ అముల్ ఫ్రాంచైజీని నిర్వహిస్తున్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ ఆర్ ఎస్ సోధి వెల్లడించారు. అముల్ సంస్థ పాలతో పాటు వెన్న, జున్ను, ఐస్‌క్రీమ్ ఉత్పత్తులను విక్రయిస్తుంది. దేశవ్యాప్తంగా అమలు కానున్న తాజా ధరల పెంపు ఎంఆర్‌పీలో 4 శాతం మాత్రమేనని, ఇది సగటు ఆహార ద్రవ్యోల్బణం కంటే తక్కువేనని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. పాలు, పాల ఉత్పత్తుల కోసం వినియోగదారులు చెల్లించే ప్రతి రూపాయిలో దాదాపు 80 పైసలు పాల ఉత్పత్తిదారులకు వెళ్తుందని, ధరల సవరణ పాల ఉత్పత్తిదారుల వేతనాలకు తోడ్పడుతుందని కంపెనీ స్పష్టం చేసింది.

Next Story

Most Viewed