రానున్న ఐదు రోజుల పాటు హీట్ వేవ్.. ఆ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్
రానున్న ఐదు రోజుల పాటు హీట్ వేవ్ అధికంగా ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. తూర్పు, దక్షిణ భారతాల్లో వేడిగాలులు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: రానున్న ఐదు రోజుల పాటు హీట్ వేవ్ అధికంగా ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. తూర్పు, దక్షిణ భారతాల్లో వేడిగాలులు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్, ఒడిషా తీర ప్రాంతాలతో పాటు సిక్కిం, కర్ణాటకలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని తెలిపింది. బిహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, రాయలసీమ, తెలంగాణలోనూ వేడి ప్రభావం ఉంటుందని తెలిపింది. పశ్చిమబెంగాల్కు మాత్రం ఐఎండీ రెడ్అలర్ట్ ఇచ్చింది. అన్ని వయసుల వారు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. అయితే దేశంలోని ఈశాన్య ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఒడిశా, బీహార్, ఆంధ్ర ప్రదేశ్, యానాం, కర్ణాటక, రాయలసీమ ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఎండలో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వృద్ధులు పిల్లలు బయటకు వెళ్లేప్పుటు జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.
ఈశాన్యంలో ఏర్పడిన తుఫాను వల్ల అరుణాచల్ ప్రదేశ్ లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో ఏప్రిల్ 24 - 28 వరకు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఏప్రిల్ 24 నుంచి 28 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.