సందేశ్ ఖాలీలో విదేశీ ఆయుధాలు..!
లోక్సభ ఎన్నికల ముందు సందేశ్ ఖాలీ ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. తాజాగా ఆ ప్రాంతంలో సీబీఐ సోదాలు చేయగా.. విదేశీ ఆయుధాలు, బాంబుల్ని స్వాధీనం చేసుకుంది సీబీఐ.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్సభ ఎన్నికల ముందు సందేశ్ ఖాలీ ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. తాజాగా ఆ ప్రాంతంలో సీబీఐ సోదాలు చేయగా.. విదేశీ ఆయుధాలు, బాంబుల్ని స్వాధీనం చేసుకుంది సీబీఐ. జనవరి 5న ఈడీ అధికారులపై టీఎంసీ నేతలు చేసిన దాడి కేసులో ప్రస్తుతం సీబీఐ ఆ ప్రాంతంలోని ఓ ఇంటిపై దాడులు చేసింది. సందేశ్ఖాలీలోని సర్బేరియా ప్రాంతంలోని స్థానిక తృణమూల్ నాయకుడు హఫీజుల్ ఖాన్ బంధువైన ఒకరి ఇంటిపై సీబీఐ రైడ్స్ చేసింది. సీబీఐ దాడుల్లో భారీగా విదేశీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, బాంబులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతో సీబీఐ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పేలుడు పదార్థాలను గుర్తించేందుకు బాంబు స్క్వాడ్ సాయం కూడా తుసుకన్నారు.
సందేశ్ ఖాలీలో టీఎంసీకి చెందిన పలువురు నేతలు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటంతో మహిళలంతా తిరగబడ్డారు. కేసులో ప్రధాన నిందితుడైన షేక్ షాజహాన్ ని అరెస్టు చేయాలని ఆందోళనలు చేపట్టారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు షాజహాన్ ను అరెస్టు చేయగా.. ఈకేసుని సీబీఐ విచారిస్తోంది. ఇకపోతే, షేక్ షాజహాన్ అరెస్ట్ తర్వాత టీఎంసీ తన పార్టీ నుంచి ఆరేళ్లు సస్పెండ్ చేసింది.