ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు.. హోళి వేడుకలకు బ్రేక్..!

by  |
no holi celebrations in delhi
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. గడిచిన వారం రోజులుగా అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఆదివారం ఢిల్లీలో 823 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా గతవారం రోజుల్లోనే అక్కడ నాలుగు వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఈనెల 28,29,30 తేదీలలో కఠిన నిబంధనలతో కూడిన ఆంక్షలు విధించాలని కేజ్రీవాల్ సర్కార్ యోచిస్తున్నది.

హోళి సందర్భంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి వేడుకలు చేసుకోవడంపై కూడా నిషేధం విధించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వానికి సూచించినట్టు తెలుస్తున్నది. ఢిల్లీలో హోళిని ఘనంగా జరుపుకుంటారు. దీంతో వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వైద్య శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హోళి వేడుకలపై గుజరాత్ సర్కారు ఇప్పటికే నిషేధం విధించిన విషయం తెలిసిందే.

దేశరాజధానిలో కరోనా వైరస్ కేసుల పెరుగుదలపై రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఈ రోజు మధ్యాహ్నం సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఎల్జీ(లెఫ్ట్ నెంట్ గవర్నర్) సీఎం కేజ్రీవాల్‌తో పాటు రాష్ట్ర ఆరోగ్య మంత్రి, ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఢిల్లీ లో ఫిబ్రవరిలో 4,193 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా మార్చినెలలో గడిచిన వారం రోజుల్లోనే 4,288 కేసులు వచ్చాయి. ఫిబ్రవరిలో రోజుకు సగటున 150 కేసులు రాగా.. ఈ నెలలో సగటున రోజుకు 400 కి పైగా కేసులు నమోదవుతున్నాయి.

Next Story