భారత్‌నుంచి అమెజాన్ రూ. 15 వేల కోట్ల విలువైన ఎగుమతులు

by  |
భారత్‌నుంచి అమెజాన్ రూ. 15 వేల కోట్ల విలువైన ఎగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేసే కార్యక్రమంలో భాగంగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లోని చిన్న, మధ్య తరహా అమ్మకందారుల నుంచి సుమారు రూ. 15 వేల కోట్ల విలువైన ఎగుమతులు చేసినట్టు కంపెనీ అధికారులు సోమవారం వెల్లడించారు. 2015లో అమెజాన్ ‘గ్లోబల్ సెల్లింగ్’ అనే కార్యక్రమం ద్వారా మారెట్ దేశ వ్యాప్తంగా ఉన్న 60 వేల మంది వ్యాపారుల నుంచి ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు సహాయపడుతోందని కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమం అమెజాన్‌కు కీలకమైన మార్కెట్‌గా ఉంది.

ప్రస్తుత సంవత్సరం జనవరిలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ భారత పర్యటనలో భాగంగా భారత్‌లోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేసేందుకు దాదాపు రూ. 7,500 కోట్లను పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించారు. 2025 నాటికి దీన్ని రూ. 75 వేల కోట్ల విలువైన భారత ఉత్పత్తులను ఎగుమతి చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ‘మొదటి బిలియన్ డాలర్లను చేరుకోవడానికి మూడేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు మరో బిలియన్ డాలర్లకు చేరుకున్నాం. గత 18 నెలల్లో వంద శాతం వృద్ధిని సాధించగలిగాం’ అని ఆమెజాన్ ఇండియా సెల్లర్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ పిళ్లై తెలిపారు. తమ చిన్న వ్యాపారులకు చౌకగా రుణాలు అందించేందుకు భారతీయ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అమెజాన్ ఇదివరకే వెల్లడించింది. భారతీయ ఎగుమతిదారులకు అతిపెద్ద మార్కెట్ అమెరికా. బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే, ఈ-టైలర్ లాంటి వార్షిక కార్యక్రమాలు అమ్మకాలు పెరగడానికి సహాపడుతున్నాయని అమెజాన్ ఇండియా గ్లోబల్ ట్రేడ్ హెడ్ అభిజిత్ కమ్రా చెప్పారు. ఎగుమతి అవుతున్న వాటిలో దుస్తులు, ఆభరణాలు, గృహోపకరణాలు, తోలు ఉత్పత్తులు, ఇంకా ఇతర ఉత్పత్తులు ఉన్నాయని అభిజిత్ కమ్రా పేర్కొన్నారు.

Next Story

Most Viewed