మతాంతర వివాహాలపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

by  |
మతాంతర వివాహాలపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
X

లక్నో : మతాంతర వివాహాలపై అలహాబాద్ హైకోర్టు బుధవారం సంచలన తీర్పును వెలువరించింది. ఈ వివాహాలకు సంబంధించి 30 రోజులపాటు నోటీసులను ప్రదర్శించడం తప్పనిసరి కాదని తేల్చింది. ఆ నోటీసులను డిస్‌ప్లే చేయవద్దని వధువు, వరులు రాతపూర్వక విజ్ఞప్తి చేస్తే ప్రదర్శించవద్దని, ఆ వివాహంపై వచ్చే అభ్యంతరాలనూ స్వీకరించవద్దని స్పష్టం చేసింది. అలాంటి నోటీసులు ప్రాథమిక హక్కులు స్వేచ్ఛ, గోప్యతలను హరించివేస్తాయని, ఇతరుల జోక్యం లేకుండా స్వేచ్ఛగా జీవిత భాగస్వామ్యాన్ని ఎంచుకోవడంపై ప్రభావం వేస్తాయని పేర్కొంది.

స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్, 1954 కింద మతాంతర వివాహం చేసుకున్న జంట పెళ్లి గురించి డిస్ట్రిక్ట్ మ్యారేజీ ఆఫీసర్‌కు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నోటీసులను వారి జిల్లా కార్యాలయంలో 30 రోజులపాటు డిస్‌ప్లే పెట్టాల్సి ఉంటుంది. వారి పెళ్లిపై ఎవరైనా అభ్యంతరాలు చెబితే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్లు పౌరుల హక్కులకు భంగం కలిగిస్తున్నాయని న్యాయమూర్తి వివేక్ చౌదరి తెలిపారు. తమ పెళ్లి నోటీసులు ప్రదర్శనకు పెట్టవద్దని ఆ జంట రాతపూర్వకంగా అభ్యర్థిస్తే మ్యారేజీ ఆఫీసర్‌ నోటీసులను డిస్‌ప్లకే పెట్టవద్దని, అభ్యంతరాలను స్వీకరించకుండా పెళ్లి ప్రక్రియ చేపట్టాలని పేర్కొన్నారు. పెళ్లి కోసం ముస్లిం నుంచి హిందు మతానికి మారిన ఓ వధువు, ఆమె భర్త దాఖలు చేసిన పిటిషన్‌పై విచారిస్తూ న్యాయమూర్తి ఈ తీర్పు వెలువరించారు. తన పెళ్లికి తండ్రి అంగీకరించడం లేదని వధువు పిటిషన్‌లో పేర్కొన్నారు.


Next Story

Most Viewed