చంద్రబాబు కంచుకోటపై వైసీపీ కన్ను.. కీలక నేతలు అందరూ అక్కడే..

by  |
peddy reddy
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని వైసీపీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే కుప్పంలో వైసీపీ పాగా వేసిన సంగతి తెలిసిందే. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో ఘన విజయం సాధించింది. దీంతో తాజాగా కుప్పం మున్సిపాలిటీపై వైసీపీ దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే తన వ్యూహరచనతో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక, బద్వేలు ఉపఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలకపాత్ర పోషించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం మున్సిపాలిటీపైనా దృష్టించారు. కుప్పం మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత తొలి ఎన్నిక ఇదే కావడంతో తొలి మున్సిపల్ చైర్మన్ వైసీపీ కైవసం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం కుప్పంలో వైసీపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.

14ఏళ్లు సీఎం కానీ కుప్పంకు మంచినీళ్లివ్వలేదు బాబు..

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల బతుకుల్లో ఆశలు చిగురించాయని, రెండున్నరేళ్ల పాలనలో ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు సొంత నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో సభకు పుంగనూరు, పీలేరు, పలమనేరు నుంచి జనాన్ని తరలించుకున్నారని ఆరోపించారు. చంద్రబాబును సొంత నియోజకవర్గ ప్రజలే అసహ్యించుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల కుప్పం నియోజకవర్గం నుంచి 25 వేల మంది శాశ్వతంగా వలస వెళ్లారని గుర్తు చేశారు. సుమారు మరో 20 వేల మంది రోజూ కూలీ పనులకు రైళ్లో బెంగళూరు, తమిళనాడు వెళ్తున్నారని ఆ పరిస్థితిని తొలగిస్తామని చెప్పుకొచ్చారు. కుప్పంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు దివంగత సీఎం వైఎస్ఆర్ ప్రాజెక్టు మంజూరు చేస్తే తమిళనాడు ప్రభుత్వంతో కుమ్మకై సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు వేయించాడని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. గంగన్న శిరస్సు ప్రాజెక్టు పనులు ముందుకుసాగనివ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. హంద్రీనీవా కాల్వను కుప్పం తీసుకురావడానికి చంద్రబాబుకు ఐదేళ్లు పట్టిందా అని ప్రశ్నించారు. అనంతపురం చర్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నీరు వదిలారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా మున్సిపల్‌ ఎన్నికలలోపు కుప్పానికి నీరు రప్పిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed