పోడు రైతుల పోరుబాట.. పట్టాలివ్వాలని కదంతొక్కిన అఖిలపక్షం

by  |
పోడు రైతుల పోరుబాట.. పట్టాలివ్వాలని కదంతొక్కిన అఖిలపక్షం
X

దిశ, కొత్తగూడ : అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన పోడు రైతుల పోరుబాట ‘సడక్ బంద్’ కార్యక్రమం పిలుపులో భాగంగా కొత్తగూడ, గంగారం మండల కేంద్రాల్లో రహదారిపై నాయకులు ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుండే అఖిల పక్ష నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీపీఐ(ఎం), కాంగ్రెస్, సీపీఐ, తుడుందెబ్బ, గిరిజన సంఘం, వివిధ ప్రజా సంఘాలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో రహదారిపై రాస్తారోకో (సడక్ బంద్) నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంతో అటవీ అధికారుల వేధింపులు మరింతగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా పోడు భూములకు పట్టాలు ఇస్తానని, పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాని చెప్పి నేటికీ ఇచ్చిన హామీపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పోడు రైతులపై అటవీ అధికారులు దాడులు చేస్తుంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరం అన్నారు. అనంతరం కొత్తగూడ, గంగారాం ఎంపీపీలు విజయ రూప్ సింగ్, సువర్ణపాక సరోజన జగ్గారావు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం హరితహారం పేరుతో పోడు భూములను లాక్కునే కుట్ర చేస్తోందన్నారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులపై అటవీ శాఖ అధికారులు దాడులు, కేసులు ఆపాలని, పేదలు సాగు చేసుకుంటున్న భూముల్లో ట్రెంచులు కొట్టకుండా ఫారెస్ట్ అధికారులకు ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. ఫారెస్ట్ అధికారుల దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రజా జీవనానికి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉదయం నుండే కొత్తగూడ ఎస్సై తన పోలీసు బలగాలతో (సీఆర్పీఎఫ్, సివిల్) భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులంతా బందోబస్తు నిర్వహించారు. మహబూబాబాద్ డీఎస్పీ సదయ్య సైతం పర్యవేక్షణ చేశారు. కొత్తగూడ మరియు గంగారాం ఎస్ఐ సురేష్, చంద్రమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. సడక్ బంద్‌లో బూర్క వెంకటయ్య, పుల్లన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీపీ విజయ రూప్ సింగ్, జడ్పీటీసీలు పులసం పుష్పలత శ్రీనివాస్, ఈసం రామ, సర్పంచ్ మల్లెల రణధీర్, వజ్జ సారయ్య, ఆగబోయిన రవి, కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed