మాకు వెంటిలేటర్లు ఇవ్వండి : షోయబ్ అక్తర్

by  |
మాకు వెంటిలేటర్లు ఇవ్వండి : షోయబ్ అక్తర్
X

కరోనా మహమ్మారి అన్ని దేశాలను గజగజలాడిస్తోంది. దక్షిణాసియా దేశాల్లో తీవ్రత కాస్త తక్కువగానే ఉన్నా.. చికిత్సకు తగిన వైద్య పరికరాలు లేకపోవడం ఆందోళనకరంగా మారింది. పాకిస్తాన్‌లోనూ కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. కొవిడ్-19 బారిన పడేవారి సంఖ్య అక్కడ రోజురోజుకూ పెరిగిపోతోంది. అదీగాక, రోగులకు చికిత్స చేసేందుకు అక్కడ సరిపడా వెంటిలేటర్లు కూడా అందుబాటులో లేవు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ పాకిస్తాన్‌లో వెంటిలేటర్ల కొరతపై స్పందించాడు. కరోనా సంక్షోభ సమయంలో విభేదాలు పక్కన పెట్టి, భారత్ తమకు వెంటిలేటర్లు ఇచ్చి ఆదుకోవాలని కోరాడు. ఇరు దేశాల మధ్య ఉన్న గొడవలను పక్కన పెట్టి సాయం చేస్తే పాకిస్తాన్ ఆ సాయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని అభ్యర్థించాడు.

పాకిస్తాన్‌కు చెందిన ఒక మీడియా ఏజెన్సీతో అక్తర్ మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశాడు. ఇండియా మాకు 10 వేల వెంటిలేటర్లు ఇస్తే అదో గొప్ప సాయంగా భావిస్తామని.. జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని అన్నాడు. కానీ మేం క్రికెట్ మ్యాచ్‌ల గురించే మాట్లాడగలం. ఇలాంటి విషయాలు మాట్లాడటానికి ప్రభుత్వం, అధికార సంస్థలు ఉన్నాయని అన్నాడు. కాగా, షోయబ్ అక్తర్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా కరోనా బాధితులను ఆదుకుంటున్నాడు.

Tags: Corona, Pakistan, Ventilators, Akhtar, Voluntary organization



Next Story

Most Viewed