నోరెత్తకండి.. కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ హెచ్చరిక

by Shyam |   (  Updated:2021-06-27 04:56:05  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​లో అనూహ్య పరిణామాలకు ప్రగతిభవన్​ మీటింగ్​ కీలకమైంది. రాష్ట్ర అధిష్టానానికి కూడా ఎలాంటి సమాచారం లేకుండా నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతిభవన్​ మెట్లు ఎక్కడంపై ఏఐసీసీ ఆగ్రహించింది. వాస్తవంగా మరో వారం, పది రోజుల్లో టీపీసీసీ చీఫ్​ ప్రకటన వస్తుందని అందరూ భావించారు. అందుకే ఢిల్లీకి వెళ్లిన రేవంత్​తో పాటు పలువురు నేతలు తిరుగుముఖం పట్టారు. కానీ సీఎం కేసీఆర్​తో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు సమావేశంపై ఫిర్యాదులందడంతో ఏఐసీసీ ఉన్నఫళంగా నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ వర్గాలు [&hellip;]</p>

నోరెత్తకండి.. కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​లో అనూహ్య పరిణామాలకు ప్రగతిభవన్​ మీటింగ్​ కీలకమైంది. రాష్ట్ర అధిష్టానానికి కూడా ఎలాంటి సమాచారం లేకుండా నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతిభవన్​ మెట్లు ఎక్కడంపై ఏఐసీసీ ఆగ్రహించింది. వాస్తవంగా మరో వారం, పది రోజుల్లో టీపీసీసీ చీఫ్​ ప్రకటన వస్తుందని అందరూ భావించారు. అందుకే ఢిల్లీకి వెళ్లిన రేవంత్​తో పాటు పలువురు నేతలు తిరుగుముఖం పట్టారు. కానీ సీఎం కేసీఆర్​తో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు సమావేశంపై ఫిర్యాదులందడంతో ఏఐసీసీ ఉన్నఫళంగా నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా వర్కింగ్​ ప్రెసిడెంట్ల జాబితాలో సీఎల్పీ నేత భట్టి పేరు ఉండాల్సి ఉండగా… ఈ సమావేశం కారణంగానే ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదని అంచనా వేస్తున్నారు. ఆ స్థానంలో గీతారెడ్డికి ఛాన్స్​ ఇచ్చారని టాక్​.

కలిసి వచ్చిన మీటింగ్​

రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి ప్రకటన ఊరిస్తూనే ఉంది. మూడేండ్ల నుంచి అప్పుడు, ఇప్పుడూ అంటూ సాగదీస్తూనే ఉన్నారు. అయితే ముందు నుంచి రేవంత్​రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నా… రాష్ట్రానికి చెందిన సీనియర్లు అడ్డుపడుతూనే ఉన్నారు. ఈ పరిణామాలు ఎలా ఉన్నా… నాలుగు రోజుల కిందట దళిత మహిళ మరియమ్మ లాకప్​డెత్​ అంశంపై ఆందోళన చేస్తున్న సీఎల్పీ నేత భట్టికి ప్రగతిభవన్​ నుంచి పిలుపు వచ్చింది. ఆయనతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు అక్కడకు వెళ్లి సీఎంను కలిశారు. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఆజ్యం పోసింది. చాలా మంది సీనియర్లు దీన్ని వ్యతిరేకించారు. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. అంతేకాదు… గతంలో ఎంపీ రేవంత్​రెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్​ వంటి నేతలు ప్రగతిభవన్​ సమీపానికి వెళ్లినా ఆరెస్ట్​ చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు పిలిపించుకున్నారనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్​ టాపిక్​గా మారింది. అయితే దీనిపై ఎలాంటి కామెంట్లు ఉన్నా… కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్​కు వెళ్లడంపై ఏఐసీసీ ఆరా తీసింది. అందుబాటులో ఉన్న నేతలతో సంప్రదింపులు జరిపింది.

వాస్తవానికి ఒక్కో రాష్ట్రానికి పీసీసీ చీఫ్​ ప్రకటన చేసుకుంటూ వస్తున్న ఏఐసీసీ… తెలంగాణ పీసీసీని మాత్రం పంజాబ్​ పీసీసీ తర్వాత ప్రకటించాలని ముందుగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేరళతో పాటు ఆయా రాష్ట్రాలకు కమిటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పీసీసీపై మాత్రం వెంటనే నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కీలకమైన సమయంలో ప్రగతిభవన్​కు వెళ్లి సీఎంను కలవడాన్ని సీరియస్​గా తీసుకుని… ముందుగా టీపీసీసీని ప్రకటించినట్లు ఏఐసీసీ వర్గాలు చెప్పుతున్నాయి. మరోవైపు పీసీసీ పీఠం కోసం రాష్ట్ర నేతలు హస్తినలో మకాం వేశారు. నిన్నటి వరకు ఢిల్లీలోనే ఉన్న రేవంత్​రెడ్డి కూడా పీసీసీ ప్రకటన ఆలస్యమవుతుందనే సమాచారంతో శనివారం ఉదయమే రాష్ట్రానికి వచ్చారు. ఒకవేళ ప్రకటన వస్తుందని తెలిస్తే అక్కడే ఉండి సోనియాను కలిసి రావాలని ముందుగా అనుకున్నారు. కానీ మరింత జాప్యంతో ఆయన ఇక్కడకు వచ్చేశారు. కానీ రాష్ట్రంలో పరిణామాలపై ఆగ్రహించిన ఏఐసీసీ రాత్రికి రాత్రే ప్రకటన విడుదల చేసింది.

మీకైనా తెలుసా..?

మరోవైపు ప్రగతిభవన్​ పరిణామాలపై శనివారం మధ్యాహ్నమే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్​ ఆరా తీశారు. ఎంపీ ఉత్తమ్​తో పాటు పలువురు సీనియర్లతో మాట్లాడారు. అనంతరం గాంధీభవన్​లో దళిత ఆవేదన దీక్ష తర్వాత నేతల మధ్య ఈ అంశం చర్చకు వచ్చింది. ఎంపీ ఉత్తమ్​… సీఎల్పీ నేత భట్టితో పాటు ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా వెళ్తారంటూ అడిగారు. కానీ సదరు ఎమ్మెల్యేలు మాత్రం తమ వాదనే వినిపించినట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. ఇక్కడ జరిగిన ఉదంతాన్ని ఏఐసీసీకి వివరించారు.

నోరెత్తకండి

మరోవైపు కాంగ్రెస్​ సీనియర్ల నోటికి ఏఐసీసీ పక్కాగా తాళం వేసింది. టీపీసీసీ ప్రకటన తర్వాత ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయరాదంటూ హెచ్చరికలు జారీ చేసింది. అటు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, చల్లా వంశీచంద్​రెడ్డి వంటి నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న నేతలు కూడా అనవసరంగా మాట్లాడరాదంటూ ఏఐసీసీ దూత మాణిక్కం ఠాగూర్​… ఒక్కొక్కరికీ ఫోన్​ చేసి చెప్పినట్లు తెలుస్తోంది.

అనూహ్యంగా మార్పులు

టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ల అంశంలో ఆఖరి నిమిషంలో మార్పులు జరిగాయని కాంగ్రెస్​ వర్గాల టాక్​. వర్కింగ్​ ప్రెసిడెంట్లుగా భట్టి విక్రమార్క, శ్రీధర్​బాబుకు ఛాన్స్ ఉందని, కానీ ప్రగతిభవన్​ మీటింగ్​ తర్వాత మార్చినట్లు చెప్పుతున్నారు. కచ్చితంగా దళిత వర్గానికి వర్కింగ్​ ప్రెసిడెంట్​ ఇవ్వాలని, అందుకే భట్టికి అవకాశం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని, కానీ సీఎంతో రహస్య సమావేశం తర్వాత మార్పులు చేశారనే ప్రచారం జరుగుతోంది. అటు శ్రీధర్​బాబుకు కూడా అంతే. అయితే సామాజికవర్గాల వారీగా సమన్యాయం కోసమే జగ్గారెడ్డికి అవకాశం ఇచ్చారంటున్నారు.

Next Story