ధాన్యం కొనేదెట్టా..?

by  |
ధాన్యం కొనేదెట్టా..?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలో రైతాంగం పండి స్తున్న పంట ఉత్పత్తులను 90 శాతానికి పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు జరుగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు లేకపోతే ధాన్యం కొనేందుకు దిక్కు లేని పరిస్థితి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2006 సంవత్సరంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటయ్యాయి. వాస్తవానికి రైతులు అప్పటివరకు ధాన్యం అమ్మితే దళారులకు.. లేకపోతే వ్యవసాయ మార్కెట్ కమిటీల్లోనే అనే విధంగా పరిస్థితులు ఉండేవి. కానీ ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కావడం.. తదనంతరం పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రైతులు పండించిన వరి ధా న్యం కొనుగోలు చేసేందుకు ఐకేపీ కేంద్రాలు వర్సెస్ పీఏసీఎస్ కేంద్రాలు అన్నట్టుగా తయారయ్యింది. దీన్ని సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం మెల్లమెల్లగా వ్యవసాయ మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేస్తూ వచ్చింది. అసలు చాలా మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు లేక మూ తబడి దుమ్ముబారిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

25 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా..

ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా గత దశాబ్ధకాలంతో పోల్చితే భూములు భారీగా సాగులోకి వచ్చాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు పెరగడం, ఎస్సారెస్పీ, శ్రీరాంసాగర్ నీరు అందుబాటులోకి రావడంతో వర్షాలు సకాలం లో కురిసి ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. దీంతో సాగు భూమి విస్తీర్ణం పెరిగింది. ఫలితంగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 25 లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యం దిగుబడులు వస్తాయనేది అధికారుల అంచ నా. కానీ వానాకాలం సీజనులో ధాన్యం దిగుబడి భారీ గా తగ్గింది. ఫలితంగా మూడు జిల్లాల్లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. అయి తే ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 870 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. అందులో వా నాకాలం సీజను ధాన్యం కొనుగోలు చేసేందుకు 500 కేంద్రాల్లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.

మార్కెట్ కమిటీల సామర్థ్యం అంతంత మాత్రమే..

ప్రస్తుత సీజనులో మూడు జిల్లాల నుంచి 25 లక్షల మె ట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు సాధించవచ్చని అధి కార యంత్రాంగం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో సగ టున 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందనుకుందాం. అయితే 500 కొనుగోలు కేంద్రాల్లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. అలాంటిది కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఉన్న 38 వ్యవసాయ మార్కెట్లలో ఏ మేరకు ధాన్యం కొనుగోలు చేస్తారనేది ఇప్పటికే స్పష్టం అవుతోంది. మార్కెట్ కమిటీల్లో నిధుల లేమి కారణంగా నిత్యం మార్కెట్ యార్డులను శుభ్రం చేసే దిక్కేలేదు. మార్కెట్ కమిటీల్లో కీలకంగా ఉండే దడువాయి, హమాలీలు, స్వీపర్లు, కాపలాదార్లు, సూపర్ వైజర్లు, టెక్నికల్ సహాయక సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఆ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేయడం అసాధ్యంగానే కన్పిస్తోంది. 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు 500 కేంద్రాలు పనిచేస్తే.. కేవలం 38 మార్కెట్ యార్డుల్లో అంత ధాన్యం కొనుగోలు చేయడంపై మార్కెటింగ్ శాఖ సిబ్బంది మల్లగుల్లాలు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో రైతాంగం ధాన్యం అమ్ముకునేందుకు నెలల తరబడి వేచిచూడాల్సి రావడం ఖాయంగా కన్పిస్తోంది.

భారం తగ్గించుకునేందుకు..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 38 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఏ కొనుగోళ్లు లేక మరుగునపడ్డాయి. పాలకు లు ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో కొనుగోళ్లు చేస్తూనే రూ.కోట్ల విలువైన మార్కెట్ యార్డుల స్థలాలను నిరుపయోగంగా మార్చారు. వాస్తవానికి ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలు అందుబాటులోకి రాకముందు వ్యవసాయ మార్కెట్ కమిటీలే కీలకంగా ఉండేవి. ప్రభుత్వం ఏ రకమైన ధాన్యం కొనుగోలు చేయాలన్నా.. వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారానే కొనుగోళ్లు చేపట్టేది. అయితే మార్కెట్ కమిటీల్లో సిబ్బంది కొరతతో పాటు ఇతర కారణాల నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల నిర్వహణే గగనంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ తాజాగా మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తేసి.. మార్కెట్ యార్డుల్లోనే కొనుగోళ్లు చేపడతామనే అంశాన్ని తేరపైకి తీసుకురావడంతో రైతాంగంలో ఆందోళన నెలకొంది. కావాలనే అప్పట్లో మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేసి.. మళ్లీ ప్రభుత్వమే మార్కెట్ యార్డుల ప్రస్తావన తేవడం ఎంతవరకు సమంజసమో అర్థంకాని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఎత్తివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉమ్మడి నల్లగొండలో..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 38 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో 21 మార్కె ట్లు మాత్రమే ప్రధానంగా పనిచేస్తున్నాయి. ఇందులో మిర్యాలగూడలోని అవంతిపురం, సూర్యాపేట, నకిరేకల్, మాల్, తిరుమలగిరి మార్కెట్లలో గతంలో కొను గోళ్లు అధికంగా జరిగేవి. కానీ ప్రస్తుతం ఆ మార్కెట్ల లో ఏలాంటి ధాన్యం కొనుగోళ్లు లేవు. ఒక్క సూర్యా పేట మార్కెట్ యార్డుల్లో మాత్రమే కందులను కొను గోలు చేశారు. తిరుమలగిరి, సూర్యాపేట మార్కెట్లలో తప్ప ఎక్కడా వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేయ డం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా వచ్చే ఏడాది నుం చి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే.. ఈ మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు చేపట్టడం గగనమనే చెప్పాలి. ఎందుకంటే.. గత దశాబ్ద కాలంగా చాలా మార్కెట్లు పడావుపడ్డాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story