అధికారుల నిర్లక్ష్యం.. ఈసీ దెబ్బకు ప్రజా ప్రతినిధుల పదవులు పోయే

by  |
అధికారుల నిర్లక్ష్యం.. ఈసీ దెబ్బకు ప్రజా ప్రతినిధుల పదవులు పోయే
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: అధికారుల నిర్లక్ష్యం.. వారి పదవికి గండమైంది.. ఎన్నికల్లో గెలిచిన రెండేళ్లకే పీఠాలు కదిలిపోయాయి.. అయిదేళ్ల కోసం ఎన్నికైన వారు.. అర్ధాంతరంగా పదవులను వదులుకోవాల్సి వస్తోంది.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చేసిన వ్యయాలను చూపించని వారిపై ఎన్నికల సంఘం వేటు వేసింది.. దీంతో తమ పదవులు మధ్యలోనే వదులుకోవాల్సిన పరిస్థితి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులకు ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది.. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది..

పాలకవర్గంలో మిగిలింది ఇద్దరే..

నిర్మల్​జిల్లా బ్రాహ్మణ్​గాంవ్​లో సర్పంచితో పాటు ఎనిమిది మంది వార్డు సభ్యులున్నారు. ఇందులో ఒకరు ఉప సర్పంచిగా ఎన్నికవగా.. ఏడుగురు వార్డు సభ్యులున్నారు. ఈ ఏడుగురు వార్డు సభ్యులు ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించలేదని.. ఎన్నికల సంఘం వీరిని పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయటంతో సర్వత్రా చర్చకు దారి తీసింది. ఇక్కడ ప్రస్తుతం సర్పంచి, ఉప సర్పంచి మాత్రమే మిగలారు. గ్రామ పంచాయతీలో 8మంది వార్డు సభ్యుల్లో ఏడుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవయ్యారు. అందులో ఆరుగురు తాజాగా పదవిని కోల్పోవటం కొసమెరుపు.

ముధోల్ పంచాయతీలో ముగ్గురిపై వేటు

ముధోల్ గ్రామ పంచాయతీలో మొత్తం 16మంది వార్డు సభ్యులు ఉండగా.. ఇటీవల సర్పంచితో పాటు ఉప సర్పంచిలు పదవుల నుంచి తొలగించబడ్డారు. 15మంది వార్డు సభ్యులుండగా.. ఎన్నికల్లో వ్యయానికి సంబంధించిన లెక్కలు చూపలేదని ముగ్గురు వార్డు సభ్యులపై ఈసీ కొరడా ఝులిపించింది. ఇందులోనూ ఇటీవల తాత్కాలిక ఉప సర్పంచిగా ఎన్నికైన వారితో పాటు తాత్కాలిక సర్పంచి, ఉప సర్పంచి కోసం పోటీ చేసి ఓడిపోయిన వారుండటం గమనార్హం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1506గ్రామ పంచాయతీలకు 2019 జనవరి నెలలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. సర్పంచితో పాటు వార్డు సభ్యులను ప్రజలు ప్రత్యక్ష ఎన్నికల్లో.. ఉప సర్పంచిని వార్డు సభ్యులు చేతులెత్తి ఎన్నుకున్నారు. ఫిబ్రవరి 1న కొత్త పాలక వర్గాలు కొలువుదీరగా.. అయిదేళ్ల కోసం ఎన్నికైన పలువురు ప్రజాప్రతినిధులకు ఎన్నికల సంఘం ఝలకిచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు చేసిన ఖర్చులకు సంబంధించి.. వివరాలు అందజేయలేదనే కారణంతో పలువురిపై వేటు వేసింది. పలువురిని పదవి నుంచి తొలగించటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. తాము మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఖర్చుల వివరాలపై నివేదిక అందజేశామని వార్డు సభ్యులు పేర్కొంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో వందలాది మంది వార్డు సభ్యులపై ఈసీ వేటు వేసింది. ఒక్క నిర్మల్ జిల్లాలోనే 110మందిని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యయం వివరాలు సమర్పించని కారణంగా వారిని పదవి నుంచి తొలగించింది. ఇప్పటికే బాసర మండలంలో 4, సారంగాపూర్ మండలంలో 26, ముధోల్ మండలంలో 28మంది వార్డు సభ్యులను పదవుల నుంచి తప్పిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని మండలాలో మాత్రం ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయగా.. అభ్యర్థులకు రశీదులు కూడా ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలైన వెంటనే తాము సంబంధిత అధికారులకు ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల వివరాలను అందజేసినా.. అధికారులు తమకు ఎలాంటి రశీదు ఇవ్వలేదని పలువురు వార్డు సభ్యులు తెలిపారు.

బ్రహ్మణ్గావ్ తో పాటు చాలా గ్రామాల వార్డు సభ్యులు కూడా ఎన్నికల లెక్కల వివరాలు సమర్పించినా.. వాటికి రశీదు తీసుకోలేదు. అన్ని కలిపి ఒకే సారి వివరాలు నమోదు చేస్తామని జమ చేసి పక్కన పెట్టిన అధికారులు.. తర్వాత దొరికినవి మాత్రమే పంపారు. దీంతో అధికారుల నిర్లక్ష్యంతో వార్డు సభ్యుల పదవికి గండం వచ్చింది. తాజాగా వారికి నోటీసులు వచ్చేవరకు తొలగించే విషయం తెలియకపోగా.. సంబంధిత అధికారుల తప్పిదం వల్లనే తమను తొలగించారని ఆరోపిస్తు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ఎన్నికల ఖర్చుల వివరాలను ఇవ్వకపోవడంతోనే ఈసీ వారిని తొలగించిందని అధికారులు పేర్కొన్నారు. అయిదేళ్ల కోసం ఎన్నికైన వారు రెండేళ్లకే పదవి కోల్పోవటంతో.. పదవి కాస్తా ముణ్నాళ్ల ముచ్చటగానే మారింది.


Next Story

Most Viewed