జైలుకెళ్లినా బుద్ధి మార్చుకోని దొంగ..!

by  |
జైలుకెళ్లినా బుద్ధి మార్చుకోని దొంగ..!
X

దిశ, నల్లగొండ : తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడిని నల్లగొండ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి సుమారు రూ.17లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వన్‌టౌన్ సీఐ నిగిడాల సురేష్ కుమార్ కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని న్యూ చైతన్య నగర్ కాలనీలో నివాసముండే ఇస్లావత్ రవీందర్ నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్టు 5న కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లాడు. ఆగస్టు 8న ఇంటికి వచ్చి చూడగా, తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలోని 20 తులాల బంగారం, రూ. 8లక్షల నగదు చోరికి గురైంది.

వెంటనే బాధితుడు స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ ప్రారంభించిన సీఐ.. కేతేపల్లి మండలం కొత్తపేటకు చెందిన వంగాల సైదులను అదుపులోకి తీసుకున్నారు. ఇతను నల్లగొండ పట్టణంలోని ఒంటి స్తంభంలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. నవంబరు 11న సైదులు అనుమానస్పదంగా తిరుగుతూ కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. చైతన్యపురి కాలనీ, హైదర్ఖాన్, వెంకటరమణ కాలనీ, గణేష్ నగర్, మునుగోడు మండలం ఊకొండి గ్రామం, నకిరేకల్, శాలిగౌరారం మండలం మనిమద్దె ,చందంపేట మండలం పోలేపల్లి గ్రామాల్లో దొంగతనాలు చేసింది తానేనని అంగీకరించాడు.

నిందితుడి నుంచి 32 తులాల బంగారం, 55తులాల వెండి, ఒక బైక్, దొంగతనానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుడు గతంలో హైదరాబాద్, మేడిపల్లి, రామన్న పేట, కేతేపల్లి మండలాల పరిధిలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్ళి బెయిల్ పై తిరిగొచ్చాడు. బుద్దిగా బతుకుతాడని నల్లగొండ జైలు పరిధిలోని ఫుడ్ కోర్టు, పెట్రోల్ బంకుల్లో పనికి పెట్టిస్తే అయినా మారకుండా తిరిగి నేరాలు చేస్తున్నట్లు సీఐ నిగిడాల సురేష్ కుమార్ చెప్పారు. చోరీ కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ నర్సింహరావు, పి. వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ పి. రాజు, కానిస్టేబుళ్లు ఎం.రాజు, ఎండీ షకీల్, శ్రీనులను ఉన్నతాధికారులు అభినందించారు.



Next Story

Most Viewed