లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లైన్‌మెన్

by  |
acb officials
X

దిశ, కొమురవెల్లి: కొమురవెల్లిలోని కేవీ సబ్ స్టేషన్‌లో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తోన్న నాగరాజు పదివేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్‌కు చెందిన వీరేందర్ సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గౌరయపల్లి గ్రామంలోని తన సొంత వ్యవసాయ భూమి వద్ద నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడం కోసం ఏఈ సంత్యంను కలిశారు. అనంతరం కొన్నిరోజుల తర్వాత మీకు ట్రాన్స్‌ఫార్మర్ అలర్ట్ అయిందని, ట్రాన్స్‌ఫార్మర్ పెట్టేందుకు, లైన్‌మెన్ నాగరాజును కలవాలని చెప్పారు.

దీంతో వీరేందర్ వెంటనే నాగరాజును సంప్రదించారు. దీంతో లైన్‌మెన్ రూ.15వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను డబ్బు ఇవ్వలేనని పలుమార్లు వేడుకున్నా వినలేదు. అనంతరం పదివేలు ఇచ్చేందుకు సిద్ధం అయిన వీరేందర్, ఏసీబీ అధికారులను సంప్రదించారు. దీంతో రంగంలోకి దిగిన డీఎస్పీ ఆనంద్ కుమార్, మెదక్ రేంజ్ ఆఫీసర్, ఇన్స్‌పెక్టర్‌లు వెంకటకుమార్ గౌడ్, రమేష్, తదితర స్టాఫ్‌తో డబ్బులు తీసుకుంటుండగా లైన్‌మెన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు.


Next Story

Most Viewed