మహాసముద్రాల్లో పేరుకుపోయిన 26 వేల టన్నుల ‘పీపీఈ’ వ్యర్థాలు..

by  |
mask
X

దిశ, ఫీచర్స్ : నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో సోమవారం ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం కరోనా పాండమిక్ టైమ్‌లో 193 దేశాలు 8 మిలియన్ టన్నుల వ్యర్థాలను సృష్టించాయి. వీటిలో 25,900 టన్నులు ‘మహమ్మారి-సంబంధిత ప్లాస్టిక్ వేస్టేజ్’ కాగా.. ఇవి మహా సముద్రాల్లోకి చేరి జల కాలుష్యానికి కారమణమవుతున్నాయి. మహమ్మారి సమయంలో సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌కు డిమాండ్ పెరగగా.. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యపై నియంత్రణ కోల్పోయేలా చేసింది.

87% వ్యర్థాలు వ్యక్తుల నుంచి కాకుండా ఆస్పత్రుల నుంచే వచ్చాయి. ఈ క్రమంలో వివిధ దేశాలు విపరీతమైన ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థవంతంగా ప్రాసెస్ చేయలేకపోతున్నాయని పరిశోధకులు అంచనా వేస్తుండగా.. ప్రపంచవ్యాప్తంగా ఆసియా(72%) నుంచే ఎక్కువ వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ప్రత్యేకంగా నదుల గుండానే ఈ ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతోంది. పరిశోధకుల లెక్కల ప్రకారం 10 నదులు 79% పాండమిక్-సంబంధిత ప్లాస్టిక్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ‘షట్ అల్ అరబ్, సింధు, యాంగ్జీ’ నదులు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. కాగా ఇలా విడుదలైన ప్లాస్టిక్.. సముద్ర అంతర్భాగంలోకి చేరడంతో జలచరాలు ముప్పును ఎదుర్కొంటున్నాయి. తీవ్రతను బట్టి మరణానికి కూడా దారితీయొచ్చని పరిశోధకులు తెలిపారు. నెదర్లాండ్స్‌లోని లీడెన్‌లో కాలువ శుభ్రపరుస్తుండగా ఒక చేప మెడికల్ గ్లోవ్‌లో చిక్కుకున్న సంఘటనతో పాటు బ్రెజిల్‌లో చనిపోయిన మాగెల్లానిక్ పెంగ్విన్ కడుపులో PFF-2 ప్రొటెక్టివ్ మాస్క్ బయటపడటం ఇదే విషయాన్ని నిర్ధారిస్తోంది.

‘మన్నికైనది, చవకైనది’ కావడం మూలాన ప్లాస్టిక్.. వ్యక్తిగత రక్షణ పరికరాలు, ప్యాకేజింగ్ ఉత్పత్తికి సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఇది సముద్ర జీవులకు ప్రమాదం కలిగించడమే కాక తీరప్రాంత పర్యావరణానికి దీర్ఘకాలిక సమస్యలను కలిగిస్తుందని నివేదికలో పేర్కొన్నారు. ఇక 2020లో 1.56 మిలియన్ ఫేస్ మాస్క్‌లు సముద్రంలోకి వెళ్లాయని మరో నివేదిక వెల్లడించింది.

Next Story

Most Viewed