సినిమా స్టైల్లో మర్డర్.. టీఆర్ఎస్ నేత స్కెచ్

by  |
crime
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని అల్వాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణం ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… అల్వాల్‌కు చెందిన అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కనకరాజుకు స్థానికంగా ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే కనకరాజుకు తెలియకుండా ఆ యువతి శ్రీకాంత్ రెడ్డి అనే మరో యువకుడితో సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే శ్రీకాంత్ రెడ్డి నెల రోజుల క్రితం ఆ యువతిని తీసుకొని వెళ్లిపోయాడు. విషయం గ్రహించిన కనకరాజు వారి కోసం గాలించాడు. చివరకు వారిని వెతికి హైదరాబాద్‌ తీసుకొచ్చి, జవహర్‌నగర్‌లోని ఒక ఇంట్లో ఇరువురినీ బంధించాడు.

తాను ప్రేమించిన యువతినే తీసుకెళ్తావా? అని ఆగ్రహంతో శ్రీకాంత్‌రెడ్డిని కొన్నిరోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. ఇటీవలే శ్రీకాంత్‌ను చంపి, స్మశానంలో పూడ్చిపెట్టాడు. అనంతరం స్నేహితులకు సమాచారం ఇచ్చి, మద్య మత్తులో చంపానని తెలిపాడు. ఈ విషయాన్ని స్నేహితులు బయట చెప్పడంతో చివరకు రాచకొండ ఎస్వోటీ పోలీసులకు తెలిసింది. దీంతో కనకరాజును అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసులు కాస్త గట్టిగా మందలించడంతో చివరకు హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్మశాన వాటికలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి, మృతదేహానికి పోస్టుమార్టం చేయనున్నారు.

Next Story

Most Viewed