కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే సీఎం కావాలి: చింతా మోహన్

by  |
kaapu-vargam-1
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో నీచ సంస్కృతి మెుదలైందని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ అన్నారు. సభ్యత లేకుండా మంత్రులు… ప్రజాప్రతినిధులు బూతులు మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసిన మంత్రులు బూతులకే పరిమితమవుతున్నారంటూ ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పర్యటించిన చింతా మోహన్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. దేశ పరిస్థితి రోజురోజుకు చాలా అధ్వానంగా తయారవుతుందన్నారు. ప్రధాని మోడీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉందన్న ఆయన ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్ని వేల కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందో ప్రజలకు కేంద్రం వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో విలువైన వ్యాక్సిన్‌లు వేసినా ఏనాడూ డప్పు కొట్టుకోలేదని గుర్తు చేశారు. 100 కోట్ల వ్యాక్సిన్ వేసి ప్రధానమంత్రి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రధాని స్నేహితుడి పోర్టులో హెరాయిన్ పెద్ద ఎత్తున దొరికితే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని..యువతకు ఉద్యోగాలు లేవని, మాదకద్రవ్యాలు మాత్రం దొరుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా ఫర్ సేల్‌గా ప్రధాని మోడీ పనిచేస్తున్నారని చింతా మోహన్ ఆరోపించారు.


Next Story