వేధింపులకు పాల్పడుతున్న యువకుడు అరెస్టు

by  |

దిశ, నల్లగొండ : అతగాడి వేధింపులకు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోబోయి.. చివరి ప్రయత్నంగా షీ టీమ్స్ ను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వేధింపులకు పాల్పడుతున్న ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట గ్రామానికి చెందిన పార్శ అఖిల్ అలియాస్ చందు అనే వ్యక్తి సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట పరిధిలో ఓ హోమ్ సెంటర్‌లో వార్డు బాయ్‌గా పనిచేస్తుంటాడు. తనతో పాటు పనిచేసే నర్సులు, వారి స్నేహితుల నంబర్లు సేకరించాడు. అనంతరం మహిళలు, యువతులను సామాజిక మాధ్యమాలు వేదికగా చేసుకుని అసభ్యకర వీడియోలతో వారిని మభ్యపెట్టి పలు రకాలుగా మోసం చేసి లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా బెదిరింపులకు దిగుతూ సోషల్ మీడియాలో మహిళలు, యువతుల పట్ల అసత్య ప్రచారం చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందిన పి. మంజుల(పేరు మార్చాం) అనే యువతి నల్లగొండ పట్టణంలోని జమా మసీదులో నివాసం ఉంటున్న ఓ వృద్ధ రోగికి సేవలు చేసేందుకు నల్లగొండకు వచ్చింది. సదరు యువతిని ట్రాప్ చేసిన అఖిల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. చివరి నిమిషంలో నల్లగొండ షీ టీమ్ పోలీసులకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అసలు విషయాన్ని బయటకు రాబట్టారు. ఈ మేరకు నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ పూర్తి వివరాలు వెల్లడించారు. సదరు యువకుడు అఖిల్ ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా పాల్పడిన లైంగిక వేధింపులన్నింటిపైనా సమగ్రమైన విచారణ చేస్తామని ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన షీ టీమ్ సీఐ రాజశేఖర్ గౌడ్, వన్ టౌన్ సీఐ నిగిడాల సురేశ్, ఏఎస్ఐ సోమిరెడ్డి తదితరులను ఎస్పీ రంగనాథ్ అభినందించారు.



Next Story

Most Viewed