పది నెలలైనా పత్తాలేని స్థాయీ సంఘం

by  |
GHMC
X

దిశ, సిటీ బ్యూరో : మహానగర పాలక సంస్థ చేపట్టే అభివృద్ది పనుల్లో, పౌర సేవల నిర్వహణతో పాటు పరిపాలనపరమైన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే స్థాయి సంఘాన్ని ఇంకా ఎన్నుకోకపోవటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ బల్దియా ఎన్నికలు డిసెంబర్ లోనే జరిగిన సంగతి తెల్సిందే! కౌన్సిల్ కు లీడర్ గా, నగర ప్రథమ పౌరురాలిగా మేయర్, ఉప ప్రధాన పౌరురాలిగా డిప్యూటీ
మేయర్ ను గత ఫిబ్రవరి 11న ఎన్నుకుని పది నెలలు గడుస్తున్నా నేటికీ స్థాయీ సంఘం ఎన్నిక అతీగతీలేకపోవటం చర్చనీయాంశంగా మారింది. పరిపాలనపరమైన అంశాల్లో ముఖ్యమైన పాత్ర పోషించాల్సిన స్థాయీ సంఘాన్ని ఎన్నుకోకపోవటం పై అధికార పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్ల మధ్య గుసగుసలు కొనసాగుతున్నాయి.

2016 నుంచి 2021 వరకు అధికారంలో పాలక మండలి ఉన్నంత కాలం కనీసం పార్టీ ఫ్లోర్ లీడర్లను నియమించకుండా, నేరుగా ప్రజల నుంచి ఎన్నుకోబడిన తమకు వార్షిక బడ్జెట్ ను కూడా కేటాయించలేదని, కనీసం ఇపుడైనా స్థాయి సంఘం సభ్యుడిగా గుర్తింపునిస్తారని భావించినా, అదీ కుదరటం లేదని కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపేమో కమిషనర్ లోకేశ్ కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మిల మధ్య రోజురోజుకి దూరం పెరుగుతుందని ఈ క్రమంలో స్థాయీ సంఘముంటే ఆర్థిక సంక్షోభం కారణంగా కొత్త అభివృద్ది పనులేమీ లేకపోయినా, కనీసం ఏడాది పొడువున ప్రజలకు అందించే అత్యవసరమైన, అతి ముఖ్యమైన సేలనైనా మెరుగుగా నిర్వహించేందుకు అనుకూలమైన నిర్ణయాలు తీసకోవచ్చునని అధికార, విపక్షాలకు చెందిన కార్పొరేటర్లు భావిస్తున్నారు.

ఎంతమంది సభ్యులు? ఎన్నికల ఎలా?
స్థాయీ సంఘం అనేది బల్దియాలో కౌన్సిల్ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునే కార్పొరేటర్ల సంఘం. ప్రస్తుతం మన బల్దియా కౌన్సిల్ లో ప్రజల నుంచి ఎన్నుకోబడిన మొత్తం 150 కార్పొరేటర్లున్నందున, పది మందికి ఒకరు చొప్పున మొత్తం 15 మందిని బ్యాలెట్ ద్వారా ఎన్నుకోవల్సి ఉంటుంది. ఈ మొత్తం 150 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని 15 మందిని ఎన్నుకుంటారు. అత్యధికంగా ఓట్లు దక్కించుకున్న వారిని స్థాయీ సంఘం సభ్యులుగా ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన కమిటీ సభ్యులు బల్దియా గా రూ. 50 లక్షల్లోపు రూపకల్పన చేసే కొత్త అభివృద్ది ప్రతిపాదనలపై చర్చించి, ఆమోదించి, కౌన్సిల్ కు పంపాల్సి ఉంటుంది.

కానీ ఇపుడు ఎలాగో బల్దియా ఖజానాలో నిధుల్లేవు, కొత్త ప్రతిపాదనల్లేవ్, అంతకు మంచి కౌన్సిల్ లో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కన్నా విపక్షమైన బీజేపీకి ఎక్కువ బలముండటంతో ఎం జరుగుతుందోనన్న భయంతో టీఆర్ఎస్ స్థాయీ సంఘం ఎన్నిక నిర్వహించటం లేదని బీజేపీ కార్పొరేటర్లు వాదిస్తున్నారు. కానీ టీఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లీస్ కు కావల్సినంత బలమున్నా, ఆ పార్టీపై నమ్మకం లేకనే స్థాయీ సంఘం ఎన్నికను సర్కారు దాట వేస్తుందన్న ఇతర పార్టీల కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed