కరోనా వ్యాక్సిన్‌పై వైద్యశాఖ కీలక నిర్ణయం.. ఇక అవన్నీ బంద్!

by  |
కరోనా వ్యాక్సిన్‌పై వైద్యశాఖ కీలక నిర్ణయం.. ఇక అవన్నీ బంద్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్​కేంద్రాల్లో ఇక నుంచి టోకెన్​విధానం బంద్​ కానుంది. ఇన్నాళ్లు కొన్ని కేంద్రాల్లో వంద నుంచి 150 మంది రాగానే టోకెన్లు ఇచ్చి మరుసటి రోజు రావాలని క్షేత్రస్థాయి సిబ్బంది సూచించేవారు. దీంతో చాలా మంది పలుమార్లు కేంద్రాలు చుట్టూ తిరిగేందుకు ఇష్టం లేక టీకా పొందేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో టీకా పంపిణీలో జాప్యం జరగుతున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లోని కేంద్రాల్లో ఈ విధానాన్ని తొలగించగా, మరిన్ని సెంటర్లలో కొనసాగుతూనే ఉన్నది. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోని కేంద్రాల్లో కూడా ఇప్పటికీ టోకెన్ల విధానాన్ని అమలు చేయడంపై ఉన్నతాధికారులు విస్తుపోతున్నారు.

ఒక వైపు లక్ష్యాన్ని వేగంగా ఛేదించేందుకు పంపిణీని స్పీడప్​చేస్తుంటే, టోకెన్ల విధానం ఏమిటనీ హెల్త్​ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డీఎంహెచ్ఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు వరకు ఫెండింగ్‌లో ఉన్న వాళ్లందరికీ టీకా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మీరేం చేస్తున్నారు..?

అర్బన్​జిల్లాల్లోనూ అర్హులకు సకాలంలో టీకా అందకపోవడంపై డీహెచ్​క్షేత్రస్థాయి అధికారులపై సీరియస్​అయ్యారు. పట్టణ పరిధిలోని ప్రాంతాల్లో కూడా 100 శాతం కాకపోతే గ్రామాల్లో ఎలా సాధ్యమవుతుందని మండిపడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​జిల్లాల్లో కూడా పంపిణీ పూర్తి కాకపోవడంపై డీహెచ్​అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు గ్రామాల్లోనే టీకా పంపిణీ ఆలస్యమవుతుందని అధికారిక రిపోర్టులు చెబుతుండగా, అర్బన్‌లోనూ వ్యాక్సిన్​లేట్​అవడంపై అధికారులూ టెన్షన్​పడుతున్నారు. చదువుకున్నోళ్లు, అవగాహన కలిగిన వ్యక్తులున్నా నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుందనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశంపై సీఎస్​సోమేష్​కుమార్​ కూడా నివేదికను కోరారు.

హైదరాబాద్​జిల్లాలో 31,44,002 మంది టీకాకు అర్హులుండగా 30,75,277 మంది మొదటి, 16,64,800 మంది రెండో డోసును తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు అసలు టీకా తీసుకోని వారు 68,725 మంది ఉండగా, గడువు ముగిసినా రెండో డోసును పొందని వారు 6,36,262 మంది పెండింగ్‌లో ఉన్నారు. మేడ్చల్ జిల్లాలో 28,21,344 మంది అర్హులుండగా 20,79,660 మంది మొదటి, 11,76,413 మంది రెండో డోసును తీసుకున్నారు. ఇప్పటికీ మొదటి డోసు పొందని వారు 7,41,684 మంది ఉండగా 4,90,582 మంది రెండో డోసును తీసుకోలేదు.

రంగారెడ్డిలో 23,28,538 మంది అర్హులుండగా 22,28,583 మంది ఫస్ట్, 11,42,655 మంది సెకండ్​ డోసును తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 99,955 మంది అసలు వ్యాక్సిన్ తీసుకోలేదు. అంతేగాక సమయం ముగిసినా 47,7,539 మంది రెండో డోసును తీసుకోలేదు. ఇక ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట్, వరంగల్ అర్బన్, కామారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది.

అత్యధికంగా టీకా

తీసుకోని

జిల్లాలు…

జిల్లా ఫస్ట్​ సెకండ్​ మొత్తం
హైదరాబాద్ 68,725 6,36,262 7,04,987
మేడ్చల్ 7,41,684 4,90,582 12,32,266
రంగారెడ్డి 99,955 4,77,539 5,77,494
ఖమ్మం 2,58,435 1,57,512 4,15,947
సంగారెడ్డి 4,67,627 1,50,634 6,18,261
నిజామాబాద్ 3,78,298 1,39,701 5,17,999
సిద్ధిపేట 1,83,729 1,06,581 2,90,310
వరంగల్​ 1,87,415 1,04,363 2,91,778
కామారెడ్డి 1,97,820 98,780 2,96,600
మెదక్​ 1,42,886 97,366 2,40,252
నల్గొండ 4,92,304 96,930 5,89,234


Next Story