రంగారెడ్డి జిల్లాలో ‘రియల్‌’ ఢమాల్ !

by  |
రంగారెడ్డి జిల్లాలో ‘రియల్‌’ ఢమాల్ !
X

దిశ, రంగారెడ్డి: రియల్ ఎస్టేట్ రంగానికి పెట్టింది పేరు అయిన రంగారెడ్డి జిల్లాలో భూ క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. మార్చి 22 జనతా కర్ఫ్యూ, వెంటనే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో రియల్ వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయింది. అయితే ప్రస్తుత పరిస్థితులను అధిగమించి మళ్లీ రియల్ వ్యాపారం పుంజుకోవాలంటే చాలా సమయం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆదాయానికి గండి..

లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో భూ క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ఎవరూ ఇంట్లో నుంచి రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఇదే క్రమంలో అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి రిజస్ట్రేషన్ల జోలికి పోకుండా కొందరు అడ్వాన్స్‌ను సైతం వదులుకుంటున్నారు. సాధారణ రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో జోరుగా రియల్ వ్యాపారం జరిగి నెలకు రూ.200 కోట్ల ఆదాయం వరకు వచ్చేది. కానీ ఫిబ్రవరి నెలలో రంగారెడ్డి, వికారాబాద్‌జిల్లాల్లో కలిపి 32వేల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌తో సుమారుగా రూ.260కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. అదే మార్చి నెలలో రెండు జిల్లాలో 21వేల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు కేవలం రూ.162 కోట్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం.

తెరిచే ఉన్న కార్యాలయాలు…

కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించినా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. అధికారులు, సిబ్బంది వంతులుగా విధులు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 18, వికారాబాద్‌ జిల్లాలో 4 సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు పని చేస్తున్నాయి. శానిటైజర్లు, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ రిజిస్ర్టేషన్లు చేసుకునే అవకాశం కల్పించినా ప్రజలు కరోనా భయంతో ఎవరూ ముందుకురాని పరిస్థితులు కనపడుతున్నాయి.

Tags: Rangareddy District, Land Registration, Sub Registrar Office, Coronavirus, Lockdown, Vikarabad, Income



Next Story

Most Viewed