టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేపై సైదాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు

by  |
టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేపై సైదాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు
X

దిశ, క్రైమ్ బ్యూరో: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చందాలు ఇవ్వొద్దంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంఘటన్ అధ్యక్షులు, న్యాయవాది కరుణాసాగర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… చందాలు ఇవ్వొద్దంటూ ఒక వర్గం ప్రజలను అవమానపర్చేలా వ్యాఖ్యలు సరైంది కాదన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కేడర్‌కు, రామ భక్తులకు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొందని, ఈ పరిణామాలు శాంతి భద్రతలపై తీవ్రమైన ప్రభావం పడుతోందన్నారు. అంతేగాకుండా యూపీ ప్రాంతంతో తెలంగాణ ప్రాంతానికి శత్రుత్వాన్ని పెంచేలా ఉందన్నారు.

బాధ్యత గల శాసన సభ్యుడి హోదాలో ఉండి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేలా వ్యాఖ్యలు చేయడం ఆక్షేపణీయం అన్నారు. ఇప్పటికే కరీంనగర్, జగిత్యాల ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయని అన్నారు. రాముడు భక్తులను అవమానపర్చేలా వ్యాఖ్యలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుపై చట్ట ప్రకారం ఐపీసీ 153(ఏ), 504 సెక్షన్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై సైదాబాద్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. ఫిర్యాదును డీడీలో నమోదు చేశామన్నారు. లీగల్ ఓపీనియన్ అనంతరం కేసు నమోదుపై పరిశీలిస్తామని తెలిపారు.



Next Story