Vikram misry: ఆపరేషన్ సిందూర్‌పై పాక్ తప్పుడు ప్రచారం.. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

by B.Srinivas |

ఆపరేషన్ సిందూర్ ఉగ్రదాడికి ప్రతిస్పందన మాత్రమేనని ఏప్రిల్ 22న పహెల్గాంలో జరిగిన దాడి అసలు ఉగ్రదాడి అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.

Vikram misry: ఆపరేషన్ సిందూర్‌పై పాక్ తప్పుడు ప్రచారం.. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) ఉగ్రదాడికి ప్రతిస్పందన మాత్రమేనని ఏప్రిల్ 22న పహెల్గాంలో జరిగిన దాడి అసలు ఉగ్రదాడి అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram misry) తెలిపారు. భారత దళాలు స్పష్టమైన ప్రణాళికతో స్పందించాయని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో గరువారం విదేశాంగ శాఖ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా విక్రమ్ మిస్రీ మాట్లాడారు. ఉద్రిక్తతలను పెంచడానికి భారత్ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. పాకిస్థానే ఉద్రికత్తలను పెంచిందని దానికి భారత్ ప్రతిస్పందిస్తుందని తెలిపారు. దాడుల్లో భాగంగా పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని, ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను మాత్రమే టార్గెట్ చేశామన్నారు.

పాక్ సైన్యం మా లక్ష్యం కానేకాదని చెప్పారు. భారత్ ఆపరేషన్‌లో పౌరులు మాత్రమే మరణిస్తున్నారని పాక్ చేస్తున్న ఆరోపణలను మిస్రీ ఖండించారు. ప్రపంచం దృష్టిని మళ్లించడానికే పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. ఉగ్రవాదంతో సంబంధం లేదని పాక్ అతిపెద్ద ప్రచారం చేస్తోందని, కానీ ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా నిరూపితమైందన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశం తర్వాత రిలీజ్ చేసిన ప్రకటనలో ఉగ్రసంస్థ టీఆర్ఎఫ్ పేరును చేర్చడానికి పాక్ నిరాకరించిందని, కానీ పహెల్గాం దాడికి బాధ్యత వహించింది ఆ సంస్థేనని గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో ఒక్క పాకిస్థానీ పౌరుడికి కూడా నష్టం జరగలేదని తెలిపారు.

పాక్ కాల్పుల తీవ్రత పెంచింది: వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్

విక్రమ్ మిస్రీతో పాటు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సైతం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. వ్యోమిక సింగ్ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంధార్, రాజౌరి ప్రాంతాల్లో మోర్టార్లు, భారీ క్యాలిబర్ ఫిరంగిని ఉపయోగించి పాక్ కాల్పులకు తెగపడుతోందని తెలిపారు. ఈ కాల్పుల కారణంగా ముగ్గురు మహిళలు, ఐదుగురు పిల్లలు సహా 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.

Next Story