India-Pak: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు.. వంద గంటల పాటు డ్రోన్ దాడులు

by Shamantha N |

భారత్‌- పాక్ మధ్య కాల్పుల విరమణ (India Pakistan ceasefire) తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. అయితే పహెల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో భారత్‌ పాక్ పై సైనిక చర్యలు చేపట్టింది.

India-Pak: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు.. వంద గంటల పాటు డ్రోన్ దాడులు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌- పాక్ మధ్య కాల్పుల విరమణ (India Pakistan ceasefire) తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. అయితే పహెల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో భారత్‌ పాక్ పై సైనిక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సుమారు వంద గంటల పాటు డ్రోన్‌, క్షిపణి దాడులు జరిగాయి. మే 7 తెల్లవారుజామున 1 గంట సమయంలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో వైమానిక దాడులను భారత్‌ ప్రారంభించింది. పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని 9 ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేశాయి. త్రివిధ దళాలు చేపట్టిన ఈ దాడుల్లో సుమారు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, మే 7న భారత్‌ జరిపిన దాడులపై పాక్‌ ప్రతిస్పందించింది. మే 7 అర్ధరాత్రి నుంచి మే 8 గురువారం తెల్లజాము వరకు సరిహద్దుల్లో కాల్పులతోపాటు 15 నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో పాక్‌ దాడులకు పాల్పడింది. అయితే ఎస్‌-400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థతో పాక్‌ డ్రోన్లు, క్షిపణులను భారత్‌ కూల్చివేసింది.

మే 8 రాత్రి నుంచి పాక్ డ్రోన్ దాడులు

ఇకపోతే, మే 8 రాత్రి నుంచి మే 9 శుక్రవారం తెల్లవారుజాము వరకు జమ్ముకశ్మీర్‌తోపాటు రాజస్థాన్‌, పంజాబ్‌లోని 36 సరిహద్దు ప్రాంతాల్లో 300 నుంచి 400 తుర్కియే డ్రోన్లను పాక్‌ ప్రయోగించింది. కాగా.. వాటిని భారత్‌ సమర్థంగా తిప్పికొట్టింది. మే 10 వరకు పాక్ ఈ దాడులను కొనసాగించింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌పై శనివారం ఉదయం 5 గంటలకు, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌పై మధ్యాహ్నం 1 గంట వరకు డ్రోన్లతో పాక్‌ దాడులు చేయగా భారత సైన్యం తిప్పికొట్టింది. మరోవైపు, మే10న పాక్‌లోని ఎయిర్‌ బేస్‌లతో సహా 8 కీలక సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. దీంతో భారత్‌ దాడుల ధాటికి పాక్‌ పరిస్థితి దారుణంగా మారింది. ఆ తర్వాత ఇరుదేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విమరణ అమలులోకి వచ్చింది. అయితే, మే 7 నుంచి 10 వరకు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సుమారు వంద గంటలపాటు డ్రోన్‌, క్షిపణి దాడులు జరిగాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

Next Story