Operation Sindhoor: ఆపరేషన్ సిందూర్ పై యూపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |
Operation Sindhoor: ఆపరేషన్ సిందూర్ పై యూపీ సీఎం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. పాక్ కు తగిన గుణపాఠం చెప్పడం ప్రతి భారతీయుడి సంకల్పమని అన్నారు. లక్నోలో జరిగిన మహారాణా ప్రతాప్ జయంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దాయాదిపై విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్నారు. యోగి మాట్లాడుతూ.. ‘‘ఇటీవల దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్‌ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు పాల్గొనడం అందరం చూశాం. ఇది సిగ్గుచేటు. ఇస్లామాబాద్ (Pakistan) ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించడం మాత్రమే కాదు దాన్ని పెంచి పోషిస్తోంది. ఈ విషయం ప్రపంచం మొత్తం కళ్లారా చూసింది. ఉగ్రవాదంతో పాక్ కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు దాని ఉనికి కోసం పోరాడుతోంది. ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన దారుణం అందరినీ కదిలించింది. ఆ అనాగరిక చర్యకు పాల్పడిన వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలకూడదని నరేంద్రమోడీ నిర్ణయించుకున్నారు. ఆ ఘటన జరిగిన నాటినుంచి పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పడమే ప్రతి భారతీయుడి సంకల్పంగా మారింది. మన సాయుధ దళాలు పాక్‌కు తగిన బుద్ధి చెప్పాయి. ప్రపంచం ముందు పాక్ ఒంటరిగా విలపిస్తోంది’’ అని యోగి అన్నారు.

ఐక్యంగా ఉండాలని..

మరోవైపు, ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఐక్యంగా ఉండాలని సాయుధ దళాలకు మద్దతు ఇవ్వాలని పౌరులను ఆదిత్యనాథ్‌ కోరారు. ఈ సమయంలో వదంతులు వ్యాపించే అవకాశాలున్నాయని.. వాటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోడీ నాయకత్వంపై నమ్మకంగా ఉండాలని కోరారు. ఈ పోరులో భారత్ కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. మరోవైపు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindhoor) దెబ్బకు పాక్‌ అతలాకుతలం అవుతోంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి కూడా అత్యంత దారుణంగా తయారైనట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.



Next Story

Most Viewed