- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Omar Abdullah: పాక్ కు ఐఎంఎఫ్ రుణం.. జమ్ముకశ్మీర్ సీఎం విమర్శలు

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడంపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విమర్శలు గుప్పించారు. రుణం ఇవ్వడం వల్ల భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గవని అన్నారు. పూంచ్, రాజౌరి, ఉరి, తంగ్ధర్ ప్రాంతాల్లో దాడి చేసేందుకు వాడుతున్న మందుగుండు సామగ్రి ఖర్చులను ఐఎంఎఫ్ చెల్లిస్తున్నప్పుడు.. ఉపఖండంలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు ఎలా తగ్గంచవచ్చని అంతర్జాతీయ సమాజం భావిస్తుందో తనకు తెలియడం లేదన్నారు. సరిహద్దుల్లో దాడుల కోసం ఐఎంఎఫ్ నిధులను పాక్ వాడుతుందని మండిపడ్డారు. ఐఎంఎఫ్ మంజూరు చేసిన రుణం కారణంగా పాక్ సైనిక చర్యలకు ఊతమిస్తుందని.. దాంతో జమ్ము కశ్మీర్లో శాంతికి విఘాతం కలిగిస్తుందన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
పాక్ కు బిలియన్ డాలర్ల రుణం
ఇదిలా ఉండగా.. పాకిస్థాన్కు బిలియన్ డాలర్ల రుణాన్ని విడుదల చేయడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) శుక్రవారం ఆమోదం తెలిపింది. ఐఎంఎఫ్ బోర్డు సమావేశం శుక్రవారం వాషింగ్టన్లో జరిగింది. పాక్కు ఉద్దీపన ప్యాకేజీపై జరిగిన ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. గతంలో ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని సమర్థంగా వాడుకోవడంలో ఐఎంఎఫ్ షరతులను పాటించడంలో పాక్ పదేపదే విఫలమవుతున్నదని తెలిపింది. "పాకిస్తాన్ ఐఎంఎఫ్ కు దీర్ఘకాలంగా రుణగ్రహీతగా ఉంది. అంతేకాకుండా షరతులకు కట్టుబడి ఉండటంలో పేలవమైన రికార్డు ఉంది. 1989 నుండి 35 సంవత్సరాల్లో పాక్ 28 సంవత్సరాలు మాత్రమే చెల్లింపులు చేసింది" అని భారత్ పేర్కొంది. ఐఎంఎఫ్ సమావేశంలో భారత్ ఓటింగ్ కు దూరంగా ఉన్న తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో ఈ విషయం తెలిపింది. పాకిస్థాన్తో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్కు అందచేస్తున్న రుణాలు సైనిక నిఘా కార్యకలాపాలకు, భారత భూభాగంపై దాడులు నిర్వహించిన లష్కరే తాయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర గ్రూపులకు పరోక్షంగా సాయపడుతున్నాయని భారత్ మొదటినుంచి వాదిస్తూ వస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి కఠిన చర్యలు తీసుకోనంత వరకు పాక్కు ఆర్థిక సహకారం అందచేయవద్దని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది.