India pak: పాక్ నిరంతరం రెచ్చగొడుతోంది.. కల్నల్ సోఫియా ఖురేషీ

by vinod kumar |
India pak: పాక్ నిరంతరం రెచ్చగొడుతోంది.. కల్నల్ సోఫియా ఖురేషీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్ పరిస్థితిని మరింత తీవ్రం చేసేందుకు ప్రయత్నిస్తోందని కల్నల్ సోఫియా ఖురేషీ (Sofiya Qureshi) తెలిపారు. తమ సైన్యాన్ని భారత సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తోందని చెప్పారు. పరిస్థితిని మరింతగా రెచ్చగొట్టే ఉద్దేశంతోనే పాక్ ఈ చర్యలకు పాల్పడుతోందన్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) నేపథ్యంలో భారత్ పాక్ ఉద్రిక్తతలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖలు ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఖురేషీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను వివరించారు. పాకిస్తాన్ సైన్యం భారతదేశ పశ్చిమ సరిహద్దులపై దాడి చేస్తోందని, భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి డ్రోన్లు, దీర్ఘ-శ్రేణి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఫైటర్ జెట్లను ఉపయోగించిందని చెప్పారు. పంజాబ్‌లోని వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి పాక్ సైన్యం శనివారం తెల్లవారుజామున హైస్పీడ్ మిస్సైల్స్ ప్రయోగించిందని తెలిపారు. అంతేగాక జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్, అవంతిపురా, ఉధంపూర్‌లోని వైద్య సదుపాయాలపైనా అటాక్ చేసిందని తెలిపారు. భారత్ ఈ దాడులన్నింటినీ తిప్పికొట్టిందని చెప్పారు.

పాక్ వాదనలు హాస్యాస్పదం: విక్రమ్ మిస్రీ

మతపరమైన ప్రదేశాలను భారత్ టార్గెట్ చేసిందని, మసీదులపై మిస్సైల్స్ ప్రయోగించిందని పాక్ చేస్తున్న ఆరోపణలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram misry) ఖండించారు. దాయాది వాదనలు పూర్తి హాస్యా స్పదంగా ఉన్నాయన్నారు. భారత్ కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందన్నారు. పాక్ జమ్మూ కశ్మీర్ లోని రాజౌరీ ప్రాంతంలో షెల్లింగ్ చేసిందని, ఈ ఘటనలో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. పాక్ చర్యల వల్లే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయన్నారు.

శత్రు చర్యలను దీటుగా ఎదుర్కొన్నాం: వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్

భారత బలగాలు పూర్తి సంసిద్దతతో ముందుకు సాగుతున్నాయని, శత్రుచర్యలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని విండ్ కమాండ్ వ్యోమికా సింగ్ తెలిపారు. భారత్ వైమాణిక స్థావరాలను ధ్వంసం చేశామని పాక్ చేస్తున్న ప్రచారాల్లో వాస్తవం లేదన్నారు. అన్ని రక్షణ వ్యవస్థలు సురక్షితంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. పాక్ చర్యలకు ప్రతిస్పందనగా భారత్ సైన్యం గుర్తించిన సైనిక లక్ష్యాలపై మాత్రమే దాడులు చేపట్టిందని తెలిపారు. హీమ్ యార్ ఖాన్‌లోని పాక్ సైనిక స్థావరాలను టార్గెట్ చేసిందని చెప్పారు. పాక్ వైపు నుంచి ప్రతిస్పందనలు రాకపోతే ఉద్రిక్తతలను నివారించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed