Flash News: మళ్లీ ఉగ్రదాడులు.. 69 ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు

by Rani Yarlagadda |
Flash News: మళ్లీ ఉగ్రదాడులు.. 69 ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాక్ సరిహద్దుల్లో కొద్దిరోజులుగా నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులకు అమెరికా దౌత్యంతో తెరపడింది. ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)కు బ్రేక్ పడింది. ఈ మేరకు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించాయి. కాగా.. భారత్ లో మరోసారి ఉగ్రదాడులు (Terror Attacks in India) జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) దేశంలోని 69 ఎయిర్ పోర్టుల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి.

బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు పారామిలిటరీ దళ ప్రతినిధి తెలిపారు. మే 18వ తేదీ వరకూ అన్ని ఎయిర్ పోర్టుల్లోని కార్గో, బ్యాగేజీ స్క్రీనింగ్ వ్యవస్థల వద్ద సీఐఎస్ఎఫ్ పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. సాధారణంగా CISFకు ప్రయాణికులను, వారి క్యాబిన్ సామానును తనిఖీ చేసే బాధ్యత మాత్రమే ఉంటుంది. కార్గో, ఇన్ లైన్ హోల్డ్ బ్యాగేజీ స్క్రీనింగ్ సిస్టమ్ (ILHBSS) తనిఖీలను విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకులు నియమించిన ప్రైవేట్ భద్రతా సిబ్బంది చేస్తారు. కానీ.. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో అన్ని తనిఖీలు సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిర్వహిస్తున్నారు.

కాగా.. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన నేపథ్యంలో దేశంలో మూతపడిన ఎయిర్ పోర్టులు తెరుచుకుంటాయా? లేక మే 15 వరకూ తొలుత కేంద్రం ఇచ్చిన ఆదేశాలే కొనసాగుతాయా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.



Next Story

Most Viewed