రాహుల్‌కు ధైర్యముంటే.. స్మృతీ ఇరానీ సవాల్

by Dishanational5 |
రాహుల్‌కు ధైర్యముంటే.. స్మృతీ ఇరానీ సవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి ధైర్యముంటే తన పూర్వపు లోక్‌సభ స్థానం అమేథీ నుంచి పోటీ చేయాలని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సవాల్ విసిరారు. రాహుల్ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర సోమవారం ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా స్మృతీ ఇరానీ మాట్లాడుతూ, ‘‘2019లో రాహుల్ అమేథీని వదిలేశారు. ఇప్పుడు అమేథీయే రాహుల్‌ని వదిలేసింది. రాహుల్‌కు ధైర్యముంటే రానున్న ఎన్నికల్లో వయనాడ్(రాహుల్ లోక్‌సభ స్థానం)లో కాకుండా అమేథీ నుంచి బరిలోకి దిగాలి’’ అంటూ సవాల్ విసిరారు. అమేథీలో రాహుల్‌ను ప్రజలు పట్టించుకోవడం లేదని, అందుకు ఆయన చేస్తున్న జోడో యాత్రలో ఖాళీగా కనిపించిన రోడ్లే నిదర్శనమని అన్నారు. తన పార్లమెంటరీ స్థానమైన అమేథీలో స్మృతీ ఇరానీ నాలుగు రోజుల పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన ‘జన్ సంవద్’లో ఆమె పైవిధంగా మాట్లాడారు. కాగా, కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందిన అమేథీలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీపై 55వేల ఓట్ల భారీ మెజార్టీతో స్మృతీ ఇరానీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, అదే ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ స్థానం నుంచి కూడా పోటీ చేసిన రాహుల్.. అక్కడ గెలుపొందారు. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో కాంగ్రెస్ కేవలం ఒక సీటు మాత్రమే దక్కించుకుంది. రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ మాత్రమే గెలుపొందారు. కానీ, రానున్న ఎన్నికల్లో సోనియా సైతం రాయ్‌బరేలీని వీడనున్నారు. ఆమె ఇప్పటికే రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో గాంధీ కుటుంబం నుంచి అమేథీలో ఎవరు పోటీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రియాంకా గాంధీని పోటీ చేయిస్తారని ఊహాగానాలు వస్తున్నా పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘‘కాంగ్రెస్ నుంచి అమేథీలో ఎవరు పోటీ చేయాలనేది పార్టీ ఎన్నికల కమిటీ త్వరలోనే నిర్ణయిస్తుంది. ఆ స్థానం నుంచి రాహుల్ గాంధీ మూడుసార్లు ఎంపీ అయ్యారు. ఆయన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సైతం అమేథీ నుంచే పోటీ చేసేవారు. ఆ స్థానం కాంగ్రెస్‌కు ఎంతో ముఖ్యమైనది’’ అని పార్టీ సీనియర్ లీడర్ జైరాం రమేశ్ తాజాగా వెల్లడించారు.





Next Story

Most Viewed