కరీంనగర్‌‌లో రక్తికట్టిస్తున్న రాజకీయాలు.. నువ్వా నేనా అన్నట్లు మూడు పార్టీల హోరాహోరీ పోరు

by Disha Web Desk 2 |
కరీంనగర్‌‌లో రక్తికట్టిస్తున్న రాజకీయాలు.. నువ్వా నేనా అన్నట్లు మూడు పార్టీల హోరాహోరీ పోరు
X

విలక్షణ తీర్పుతో ప్రత్యేకతను చాటుకునే కరీంనగర్ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కట్టనున్నారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువుగా ఉన్న కరీంనగర్ పైన అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. రాజకీయ వ్యూహాలు రచిస్తూ గెలుపు కోసం ఆరాటపడుతున్నాయి. అయితే కరీంనగర్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. తెలంగాణ ఉద్యమంతో బీఆర్ఎస్ అడ్డగా మారింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కారు పార్టీకి ఓసారి అవకాశం ఇచ్చిన కరీంనగర్ జనం మరోసారి బీజేపీకి పట్టం కట్టారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా ఇక్కడ మాత్రం సిట్టింగ్ ఎంపీగా బీజేపీ నేత కొనసాగుతున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారనేది ఉత్కంఠగా మారింది. విలక్షణ తీర్పుతో ప్రత్యేకత చాటుకున్న కరీంనగర్‌లో విజయదుందుభి మోగించేది ఎవరనే దానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ దళపతి కేసీఆర్‌ను ఐదేళ్లలో మూడుసార్లు ఎంపీగా ఎన్నుకున్న ప్రజలు, ప్రతి ఎన్నికల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.‌ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నాయి.

దిశ బ్యూరో, కరీంనగర్: ఐదు జిల్లాల్లో విస్తరించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన ఈ పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 19సార్లు ఎన్నికలు జరుగగా 9సార్లు కాంగ్రెస్, ఉపఎన్నికలతో కలిపి 4సార్లు బీఆర్ఎస్, 3సార్లు బీజేపీ, ఒకసారి టీడీపీ, మరోసారి తెలంగాణ ప్రజాసమితి గెలిచాయి.‌ అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉన్న ఈ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ట్రై యాంగిల్ ఫైట్ హాట్ టాపిక్‌గా మారుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి.

మూడు పార్టీల పోరాటం...

ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా బీజేపీకి చెందిన బండి సంజయ్ కొనసాగుతున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ స్థానాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది. పదేళ్లు అధికారం కోల్పోయిన కాంగ్రెస్, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ఎన్నికల్లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ బరిలో నిలుస్తుండగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచాల రాజేందర్ రావు బరిలో నిలుస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 16,37,138మంది ఉన్నారు. అందులో 8,49,478మంది పురుషులు, 8,80,142మంది మహిళలు, 64మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్, మూడు బీఆర్ఎస్ గెలుచుకుంది. వేములవాడ, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగుర వేయగా కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుంది. బీజేపీ హుజూరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. హుజూరాబాద్, కరీంనగర్‌లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 13,76,685 ఓట్లు పోల్ కాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్‌కు 5249 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. బీఆర్ఎస్‌కు 5,17,601 ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 5,12,352ఓట్లు, బీజేపీకి 2,50,400 ఓట్లు లభించాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీజేపీ నేత బండి సంజయ్‌కు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4,98,276 ఓట్లు లభించగా నాలుగున్నర ఏళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 2.50లక్షల ఓట్లే దక్కాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ, వారికి లభించిన ఓట్లు బీఆర్ఎస్ కంటే 5249 తక్కువగా ఉండడం, బీజేపీ సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్ కొనసాగుతుండడంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్టీలు కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రికరించాయి.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ 2004లో కాంగ్రెస్ మద్దతుతో తొలిసారి ఎంపీగా గెలుపొంది కేంద్ర కార్మిక మంత్రిగా కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యూపీఏ సర్కార్ నుంచి బయటకు వచ్చి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి 2లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలంగాణ ఉద్యమానికి ఊతమిస్తు మరోసారి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉద్యమ బిడ్డగా 2008 ఉప ఎన్నికలో కేసీఆర్‌ను మరోసారి కరీంనగర్ ప్రజలు గెలిపించి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను చాటి చెప్పారు. 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ 52వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్‌పై గెలిచారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్‌లో పొన్నం తన వాణి వినిపించి పెప్పర్ స్ప్రే దాడికి గురయ్యారు. అందరి పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వినోద్ కుమార్ ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌పై వినోద్ కుమార్ 2.05లక్షల మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ పోటీ చేయగా బీఆర్ఎస్‌పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 89,508 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం 1.79లక్షల ఓట్లు పొంది మూడో స్థానానికి పరిమితమయ్యారు.

రసవత్తరంగా రాజకీయం...

మూడు ప్రధాన పార్టీలు తక్కువేం కాదన్నట్లు వ్యవహరించడంతో తాజాగా కరీంనగర్ రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. విమర్శలు.. ఆరోపణలు.. సవాళ్లు ప్రతిసవాళ్లతో ప్రజలను ఆకర్షించేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. బహిరంగ సవాళ్లతో రాజకీయ దుమారం రేపుతున్నారు. వలసలను ప్రోత్సహిస్తూ రోజురోజుకూ ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆచితూచి తీర్పు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.



Next Story

Most Viewed