ఏప్రిల్ 7 తర్వాత లోక్‌సభ ఎన్నికలు.! ఐపీఎల్ షెడ్యూలే సాక్ష్యం

by Dishanational5 |
ఏప్రిల్ 7 తర్వాత లోక్‌సభ ఎన్నికలు.! ఐపీఎల్ షెడ్యూలే సాక్ష్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని అటు రాజకీయ పార్టీలు, నేతలతోపాటు ఇటు సామాన్య ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి 9వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సిద్ధమవుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపినట్టు జాతీయ మీడియాలో ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతకన్నాముందే(గత శనివారం), ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తిచేశామని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ సైతం వెల్లడించారు. దీంతో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే తొలి దశ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 7 తర్వాత జరగనున్నట్టు తెలుస్తోంది. గురువారం విడుదలైన ఐపీఎల్ షెడ్యూల్ ఆధారంగా ఈ విషయం స్పష్టమవుతోంది.

ఈసీతో చర్చించిన బీసీసీఐ అధికారులు!

గురువారం విడుదలైన ఐపీఎల్ షెడ్యూల్ పూర్తిస్థాయి షెడ్యూల్ కాదు. మొదటి 21 మ్యాచ్‌ల తేదీలను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. తొలి దశ షెడ్యూల్ ప్రకారం, మార్చి 22న చెన్నయ్ వేదికగా మొదటి మ్యాచ్‌ జరగనుండగా, ఏప్రిల్ 7న లక్నో వేదికగా 21వ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత జరిగే మ్యాచ్‌ల వివరాలను లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రకటించనుంది. ఈ ఎన్నికలు దశలవారీగా ఆయా రాష్ట్రాల్లో జరగనున్నాయి. కాబట్టి, షెడ్యూల్ విడుదలైతే, దాని ఆధారంగా రెండో దశ ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ నిర్ణయించనుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రంలో పోలింగ్ తేదీతోపాటు ఆ తేదీకి ముందు రోజు, తర్వాతి రోజు ఐపీఎల్ మ్యాచ్‌లు లేకుండా చూడాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా మ్యాచ్‌ వేదికలను మార్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ తొలి దశ షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసింది. అది కూడా కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చించిన తర్వాతనే విడుదల చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఐపీఎల్ షెడ్యూల్ గురించి బీసీసీఐ అధికారులను పలుమార్లు ప్రశ్నించగా, ఈసీతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించడం గమనార్హం. దీన్నిబట్టి, ఈసీ సూచనల మేరకే బీసీసీఐ ఏప్రిల్ 7వరకు ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసిందని అర్థం చేసుకోవచ్చు.

గత ఎన్నికలూ ఏప్రిల్ 7 తర్వాతనే..

గత లోక్‌సభ ఎన్నికలు సైతం ఏప్రిల్ 7 తర్వాతనే జరగడం గమనార్హం. 2019 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ఆ ఏడాది మార్చి 10న విడుదలవగా, ఏప్రిల్ 11 నుంచి మే 19 మధ్య ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు మే 23న పూర్తయింది. అదే రోజున ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ లెక్కన రానున్న లోక్‌సభ ఎన్నికలు సైతం ఒకటి రెండు రోజులు అటు ఇటుగా ఇవే తేదీల్లో నిర్వహించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అంటే, ఎన్నికల షెడ్యూల్ మార్చి 10 నుంచి 13 తేదీల మధ్య విడుదలయ్యే అవకాశం ఉండగా, తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 10 నుంచి 15 తేదీల మధ్య నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా షెడ్యూల్ విడుదలైనప్పుడే ఊహాగానాలకు చెక్ పడుతుంది.




Next Story

Most Viewed